హోదాపై ఎవరి తరఫున మాట్లాడారు: ఇరుకునపడ్డ సుజనా చౌదరి
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పైన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి ఇరుకున పడ్డారు. ప్రత్యేక హోదా డిమాండ్ పైన తన గళాన్ని గట్టిగా వినిపించేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే, ఆయన కేంద్రమంత్రి కాబట్టి ఇరుకున పడ్డారు.
తాను మంత్రిగా కొనసాగుతున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా నిలదీయలేకపోయారు. ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారా లేక పార్టీ తరఫున మాట్లాడుతున్నారా అని విపక్ష సభ్యులు ఆయనను ప్రశ్నించారు. దీంతో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అంతేకాదు, చర్చ సమయంలో సుజనను పలుమార్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ వారించారు. 'సుజనా చౌదరీ... మీరు కేంద్ర కేంద్రమంత్రి.. ఈ అంశంపై చర్చలో పాల్గొంటున్నారు. మీకు సమయాన్ని నిర్దేశించలేను. సంక్షిప్తంగా ప్రసంగించండి' అని కురియన్ ఒకటికి రెండుసార్లు చెప్పారు.

సుజనా చౌదరికి ఇచ్చిన టైం అయిపోవడంతో పలుమార్లు బెల్ కొట్టారు. తనకు ఐదు నిమిషాలు కావాలని సుజన విజ్ఞప్తి చేశారు. ఒకటికి రెండుసార్లు సుజన తనకు మరింత సమయం కావాలని అడిగారు.
ఓ సమయంలో సుజన అలా చదువుకుంటూ వెళ్తుంటే... డిప్యూటీ చైర్మన్ పలుమార్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. సుజన మాత్రం చదువుకుంటూ వెళ్లారు. ఓ సమయంలో మీరు కేంద్రమంత్రి అని, చర్చలో మీకు సమయాన్ని నిర్దేశించలేనని డిప్యూటీ చైర్మన్ చెప్పారు.
కాగా, ఏపీని రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ విభజించిందని సుజన అంతకుముందు మండిపడిన విషయం తెలిసిందే. ఎవరితోనూ సరైన చర్చలు జరపకుండానే, చట్టసభల్లో సంఖ్యాబలం ఉందని చెప్పి , ఏపీని ఆనాడు ముక్కలు చేశారన్నారు.
రాష్ట్ర విభజనకు రెండు ప్రధాన జాతీయ పార్టీలే కారణమన్నారు. చర్చ సందర్భంగా ఏపీని ఇతర రాష్ట్రాలతో పోలుస్తున్నారని, అది సరికాదని, ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు వేరు, ఇతర రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు వేరన్నారు.












Click it and Unblock the Notifications