సాధారణ ప్రయాణీకులతో రైల్లో వెంకయ్య - ఆ నాలుగు "సి" లు దురదృష్టం..!!
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. సాధారణ ప్రయాణీకులతో కలిసి రైళ్లో ప్రయాణం చేసారు. బాపట్ల జిల్లా వేటపాలెం లో బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన విజయవాడ నుంచి పినాకినీ ఎక్స్ ప్రెస్ లో వెళ్లారు. సాధారణ పౌరుడిలా ప్రజల మద్య ప్రయాణించారు. చీరాలలో దిగి వేటాపాలెం వెళ్లారు. విద్య- వైద్యంతో పాటుగా మౌళిక వసతుల కల్పిన కు ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయ పడ్డారు. సంపద పెంచుకోకుండా ఉచితాల పంపిణీ సరి కాదని వ్యాఖ్యానించారు.
తాను రాష్ట్రపతి కాలేదనే బాధ లేదన్నారు. సాధారణ కార్యకర్తగా మొదలై.. ఉప రాష్ట్రపతిగా పని చేసిన అవకాశం దక్కటం సంతోషకరమన్నారు. ఒంగోలులో జరిగిన ఆత్మీయ సమావేశంలోనూ వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. పార్లమెంటరీ వ్యవస్థ ఎంత పటిష్ఠమైతే ప్రజలకు అంత మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల్లో కులం, మతం కాకుండా అభ్యర్ధి గుణగణాలను చూసి ఓటు వేయాలని సూచించారు. తన రాజకీయ జీవితం యాభై ఏళ్ల క్రితం ఒంగోలు నుంచే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు.ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతిగా పని చేసే అవకాశం దక్కిందన్నారు. ప్రోటోకాల్ వలన ఎన్నో చేయలేకపోయానని.. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్చ ఉందన్నారు.
ఏడు పదుల వయసు వచ్చినా తనలో ఓపిక, శక్తి తగ్గలేదని వెంకయ్య చెప్పారు. తిరగ గలిగినన్ని రోజుల ప్రజల మధ్య ఉంటూ వారికి చెప్పాల్సినవి చెప్పి..చైతన్యం తెస్తానని పేర్కొన్నారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్టు ఉ్న వ్యక్తులను ఎన్నుకోవాల్సింది పోయి ఆ నాలుగు "సి" ల స్థానంలో క్యాష్.. క్యాస్ట్..కమ్యూనిటీ.. క్రిమినాలిటీ ఉన్న వారిని గెలిపిస్తున్నారని విశ్లేషించారు. కొందరు కులం, మతం, వర్ణం, వర్గం పేరుతో చల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజాధనం దోచుకున్న వారిని..ప్రాంతాల మధ్య విభేదాలను తీసుకొచ్చే వారిని దూరం పెట్టాలని వెంకయ్య పిలుపునిచ్చారు.