రేప్ చేస్తారా, నడుం తిప్పటం.. ఏంటివి: రోజాపై గాలి, ట్విస్ట్.. లేఖపై అసంతృప్తి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా పైన టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు. ఆమె పైన తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. అసెంబ్లీలో రోజా ప్రవర్తనను అందరూ చూశారన్నారు.
తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరని రోజా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వైసిపి అధినేత వైయస్ జగన్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారని చెప్పారు. జగన్ సేవ్ డెమోక్రసీ ర్యాలీ చేస్తామని చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
సభలో రోజా ప్రవర్తన సరిగా లేదన్నారు. నాలుక ఆడించడం, కాలు పైకి లేపడం, నడుమును తిప్పటం, నన్ను రేప్ చేసే వాళ్లు లేరని చెప్పడం, మీలో ఎవరైనా నన్ను రేప్ చేసే వారు ఉన్నారా అని విలేకరులను ప్రశ్నించడం.. ఏమిటీ వ్యాఖ్యలు అన్నారు. ఎవరైనా ఇలాంటి మాటలు అంటారా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు శుశిపాలుడిని ఉదహరించారని, ఇప్పటికైనా రోజాకు జ్ఞానోదయం కావాలన్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
రోజాలేఖపై ప్రభుత్వ లాయర్ అసంతృప్తి
రోజా రాసిన లేఖలో ఆమె వాస్తవాలను వక్రీకరించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున తాను ఏమీ హామీ ఇవ్వలేనని చెప్పారు. రోజా ఇచ్చే వివరణపై సంతృప్తి చెందకపోతే స్పీకర్ ఏ నిర్ణయమైన తీసుకోవచ్చుని ధర్మాసనం చెప్పింది.
కాగా, రోజా క్షమాపణలు చెప్పాలని సుప్రీం కోర్టు సూచించింది. కానీ రోజా తన తాజా లేఖలో క్షమాపణలు చెప్పలేదు. కానీ తన వ్యాఖ్యలతో బాధపడిత వాటిని వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. అలాగే వివరణ ఇచ్చారు. సుప్రీం కోర్టు సూచించిన ప్రకారం క్షమాపణ చెప్పకుండా రోజా పంపిన వివరణ లేఖను అనుమతించేది లేదని ప్రభుత్వ లాయర్ చెప్పారు.