దసరాకు కల్లు, ప్రభుత్వ వైన్షాపులు: పద్మారావు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అవసరమైతే మద్యం దుకాణాలను నడపాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైదరాబాదులో 106 వనైన్ షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదని, వాటి కోసం మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలంగాణ ఆబ్కారీ మంత్రి పద్మారావు చెప్పారు.
తదుపరి నోటిఫికేషన్ తర్వాత కూడా ఎవరూ ముందుకు రాకపోతే ఆ వైన్ షఆపులను బీవరేజెస్ కార్పోరేషన్ సహకారంతో ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. దసరా పర్వదినానికల్లా హైదరాబాదులో కల్లు దుకాణాలను తెరిపిస్తామని మంత్రి చెప్పారు.
గీత కార్మికులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ఆబ్కారీ అధికారులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
హైదరాబాదులోని ధూల్పేటలో అక్రమ సారా తయారీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని పద్మారావు చెప్పారు. ప్రతి జిల్లాలో ఎక్సైజ్ పోలీసు స్టేషన్లకు సొంత భవనాలు నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. 10, 15 రోజుల్లో హోలోగ్రామ్ విధానాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు.