"అన్నయ్య"ను "తమ్ముడు" దాటేస్తారా: జనసేనకు ఓట్లు..సీట్లు ఎన్ని: కింగ్ మేకర్ అంటూ..!
ఏపీ పాలిటిక్స్లో ఫలితాల పైన ఎంత ఆసక్తి ఉందో..ప్రత్యేకించి జనసేన ప్రభావం పైనా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. జనసేన దక్కించుకొనే సీట్లు..ఓట్లు గురించి పందేలు కాస్తున్నారు. ఇదే సమయంలో 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం సాధించిన సీట్ల..ఓట్లతో ఇప్పుడు జనసేన దక్కించుకొనే సీట్లు..ఓట్ల గురించి పోలిక పెడుతున్నారు.ఇదే సమయంలో టీడీపీ..వైసీపీ మీద జనసేన ఎవరి ఓట్లను దెబ్బ తీసిందనే చర్చ సాగుతుండగానే.. ప్రభుత్వ ఏర్పాటులో తామే కింగ్ మేకర్ల మని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు..
పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో అంటున్న నాగబాబు ... మెగా బ్రదర్ ధీమా ఏంటో
నాడు ప్రజారాజ్యం..నేడు జనసేన..
ప్రజారాజ్యం కొన్ని కారణాల వలన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని జనసేన అధినేత పవన్ అనేక సార్లు చెబుతూ వచ్చారు. అయితే, అప్పుడు ప్రజారాజ్యం గెలుపు కోసం పవన సైతం కష్టపడ్డారు. ఇక, ఇప్పుడు చిరంజీవి సాయం లేకుండా కేవలం పవన్ తన పార్టీ గెలుపు కోసం ప్రయత్నించారు. నాగబాబు తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు . తాజా ఎన్నికల్లో జనసేన 2009లో ప్రజారాజ్యం కంటే ఏ మేర అధికంగా ఓట్లు..సీట్టు సాధిస్తుందనే చర్చ మొదలైంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం కారణంగా తమకు నష్టం జరిగి అధికారం కోల్పోయామని టీడీపీ అధినేత చంద్రబాబు పలు మార్లు చెప్పేవారు. అదే విధంగా కాంగ్రెస్ నేతలు సైతం ప్రజారాజ్యం కారణంగా తాము అధికారంలోకి వచ్చినా అంచనా వేసిన సీట్లు దక్కించుకోలేక పోయామని పలు మార్లు వాపోయారు. ఇప్పుడు సైతం పార్టీ సమీక్షలో స్వయంగా టీడీపీ అధినేత జనసేన కారణంగా దాదాపు 30 సీట్లకు పైగా మన పార్టీ మీద ప్రభావం పడిందని చెప్పుకొచ్చారు. ఇక, వైసీపీ నేతలు ఉభయ గోదావరి జిల్లాలో తమకు నష్టం కలిగిందని అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు.
ప్రజారాజ్యంకు 18 సీట్లు..జనసేనకు...
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 సీట్లు సాధించింది. అందులో తెలంగాణ ప్రాంతంలోనూ రెండు సీట్లు గెలుచుకుంది. పార్టీ అధినేత చిరంజీవి రెండు సీట్లలో పోటీ చేయగా..సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడి..తిరుపతిలో గెలుపొందారు. ప్రజారాజ్యం నుండి ఆళ్లగడ్డ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన శోభా నాగిరెడ్డి ఆ తరువాత వైసీపీలో చేరారు. ఇక, ప్రజారాజ్యం అభ్యర్దులు గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలో ఇతర పార్టీలకు భారీ నష్టం చేసారు. దాదాపు 30 చోట్ల గెలుపు అంచుల వరకూ వెళ్లారు. ఇక, ఇప్పుడు జనసేన గురించి రకరకాల విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన భారీగా ఓట్లను దక్కించుకుందని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. అయితే ఎన్ని సీట్లు గెలుస్తారనేది మాత్రం స్పష్టత రాలేదు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జనసేన ప్రభావం కనిపించిందని..గుంటూరు..కృష్ణా జిల్లాల్లో కొన్ని సీట్లలో పవన్ సత్తా చాటారని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక, పవన్ సైతం అన్నయ్య బాటలోనే రెండు సీట్లలో భీమవరం..గాజువాకల్లో పోటీలో ఉన్నారు.
కింగ్ మేకర్ అంటూ పార్టీ నేతలు..
తాము ప్రజారాజ్యం కంటే గణనీయంగా ఓట్లు సాధించామని..ఆ విషయం 23వ తేదీన స్పష్టమవుతుందని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక సీట్లు సాధించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. విశాఖ, అమలాపురం, రాజమండ్రి లోక్సభ స్థానాల్లో గట్టి పోటీ ఉందని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. ఇక, ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ తమకు రాకపోయినా..కొత్త ప్రభుత్వం ఏర్పాటులో మాత్రం తాము కింగ్ మేకర్గా ఉంటామని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున జనసేనకు మద్దతుగా నిలిచారన్నది ఆ పార్టీ నేతల విశ్లేషణ. దీంతో..నాటి ప్రజారాజ్యం ఎఫెక్ట్ కంటే నేటి జనసేన ప్రభావం ఎలా ఉందో తెలియాలంటే ఈనెల 23 వరకు వేచి చూడాల్సిందే..