కెసిఆర్లా చేయండి: 'కాపు'పై బాబుకు కృష్ణయ్య నిలదీత, 'సీఎం సాయం చేయకుంటే చస్తా'
విజయవాడ/అనంతపురం: తమకు నష్టం లేకుండా కాపులను బీసీలలో ఎలా చేర్చుతారో చెప్పాలని బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మంగళవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహించారని, ఏపీలోనూ జనాభా లెక్కలపై సర్వే జరపాలన్నారు.
కాపులను బీసీలలో చేర్చే విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కాపులకు కార్పోరేషన్ ఇచ్చినట్లు బీసీలకు కూడా ఓ కార్పోరేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు.
బీసీలకు అన్యాయం చేయాలని బాబుకు లేదు: చీఫ్ విప్
బీసీలకు అన్యాయం చేయాలని చంద్రబాబు ఉద్దేశ్యం కాదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మంగళవారం అన్నారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులను బీసీలలో చేర్చుతామని చెప్పారు. చంద్రబాబు ఆ ఆలోచననే చేస్తున్నారని చెప్పారు.
కులాల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్ర: వైసిపి ఎమ్మెల్యే
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆరోపించారు. దళితులు అంటే టిడిపికి గౌరవం లేదన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన టిడిపి దళిత నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
కేంద్రమంత్రిని కలిసిన చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభును కలిశారు. ఆయన ఎదుట పలు ప్రాతిపాదనలు చేశారు. విశాఖ రైల్వేజోన్ పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. దాంతో పాటు రాజమహేంద్రవరం పాతరైల్వే బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. విజయవాడ - అమరావతి - గుంటూరును కలుపుతూ రైల్వేమార్గం నిర్మించాలని తెలిపారు.
విశాఖ - చెన్నై మధ్య మూడో రైల్వేలైన్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవాలని, కాకినాడ - పిఠాపురం, నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్ల నిర్మాణం, గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్ పనులు చేపట్టాలని కేంద్రమంత్రికి విన్నవించారు. ఇతర రైల్వేలైన్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. విశాఖ - చెన్నై మూడోలైనుపై నిర్మయం తీసుకోవాలన్నారు.
'సీఎం సాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా'
సీఎం చంద్రబాబుకి తన బాధను చెప్పుకునేందుకు వెళ్లిన ఒక మహిళను నెల రోజుల నుంచి అనుమతించలేదట. గుంటూరుకు చెందిన పద్మావతి ఒక ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. కిడ్నీ సంబంధిత వ్యాధుల కారణంగా ఆమె భర్త కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు.
ఈ నేపథ్యంలో తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తనకు సాయం చేయాలని కోరేందుకు తన ముగ్గురు పిల్లలతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ ఆమె తిరుగుతోంది. ఎన్నిసార్లు అక్కడికి వెళ్లినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ప్రధాన గేటు వద్దే ఆపేస్తున్నారు.
వినతిప్రతం ఇస్తే, దానిని పరిశీలించిన తర్వాత ఆమెను లోపలికి అనుమతిస్తామంటూ భద్రతా సిబ్బంది నెల రోజులుగా ఇదే మాట ఆమెకు చెబుతున్నారు. దీంతో, విసిగిపోయిన ఆమె, సీఎంను కలిసే వరకు తాను వెళ్లేది లేదంటూ... తన ముగ్గురు పిల్లలతో కలిసి రోడ్డుపైనే కూర్చుంది. ముఖ్యమంత్రి సాయం చేయకపోతే తాను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతోంది.