ఏ ప్రశ్నకైనా సమాధానం: కేసీఆర్, కేబీఆర్ ఫైరింగ్ పైన..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ రావు సభలో బుధవారం ఉదయం శాసన సభలో పింఛన్ల అంశంపై మాట్లాడారు. ప్రతిపక్షాలు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రభుత్వం పేదల కోసం ఎంతైనా ఖర్చు చేస్తుందన్నారు. నిరుపేదలు గౌరవంగా బతికేందుకే ఆసరా పథకం తీసుకు వచ్చినట్లు తెలిపారు. అర్హులైన పింఛన్ దారులను గుర్తించేందుకు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తామని చెప్పారు.
ప్రతిపక్ష సభ్యులు బయటకు వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంతో సభను అడ్డుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష సభ్యులు కొందరు సస్పెన్షన్ కోసమే సభకు వచ్చినట్లుగా ఉందన్నారు. సభను అడ్డుకోవద్దన్నారు.
దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం పింఛన్లు ఇస్తోందన్నారు. అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పింఛన్లకు సంబంధించి 39 లక్షల 63 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. 24 లక్షల 21 వేల మందిని అర్హులుగా గుర్తించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీకి రూ.3350 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. గతంలో ఇచ్చిన పెన్షన్లు కనీస అవసరాలు తీర్చలేదన్నారు.
అలాగే, హైదరాబాదులో కలకలం రేపిన అరబిందో పార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన కాల్పుల ఘటన పైన ప్రభుత్వం ప్రకటన చేస్తుందన్నారు. గురువారం శాంతిభద్రతలపై చర్చకు సిద్ధమన్నారు. కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు.