కేజ్రీవాల్ సక్సెస్: జెపి ఎందుకు ఫెయిలయ్యారు?
హైదరాబాద్: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోకసత్తా ఎందుకు విఫలమయ్యారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యాలు, ఆదర్శాలకు లోకసత్తా ఆదర్శాలకు, లక్ష్యాలకు తేడా లేదు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ గొంతెత్తినట్లుగానే జయప్రకాష్ నారాయణ కూడా పోరాటం చేశారు.
లోకసత్తాకు మొదట్లో యువత నుంచి విశేషమైన స్పందన లభించింది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా కోస్తాంధ్రలో గణనీయమైన ఓట్లు పడ్డాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి లోకసత్తా చీల్చుకున్న ఓట్లు కూడా కారణమయ్యాయి. ఈ అంచనాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చారు.
కాగా, జయప్రకాష్ నారాయణ స్వయంగా పోటీ చేసి హైదరాబాదులోని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మేధావిగా, నిజాయితీగల వ్యక్తిగా జయప్రకాష్ నారాయణకు మంచి పేరుంది. ఐఎఎస్ అధికారిగా ఆయన ప్రకాశం జిల్లాలో కల్పించిన నీటి సదుపాయం గురించి అందరూ చెప్పుకుంటారు. ఎన్నారైల మద్దతు కూడా లోకసత్తాకు గణనీయంగానే లభించింది. ఒక రకంగా చెప్పాలంటే, చదువుకున్న మధ్యతరగతి, యువత జయప్రకాష్ నారాయణ వైపు ఆశతోనే చూశారు.
అయితే, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా ప్రభుత్వంపై ఆచరణాత్మకమైన ఆందోళన చేసిన దాఖలాలు లేవు. అవినీతిపై గానీ అత్యాచారాలపై గానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా లోకసత్తా ఆంధ్రప్రదేశ్లో పోరాటాలు చేయలేదు. దానికి తోడు, జెపికి కులం కూడా ఓ ఆటంకంగా మారింది. అదే రీతిలో ప్రాంతం కూడా. ఆయన కూకట్పల్లిలో విజయం సాధించడానికి కులం, ప్రాంతం ప్రధాన పాత్ర పోషించాలనే అభిప్రాయం బలంగా ఉంది. దాన్ని తొలగించుకోవడానికి ఆచరణలో జెపి చేసిన ప్రయత్నమేదీ లేదు.
దానికి తోడు, జెపిని తొలుత అబిమానించిన తెలంగాణ ప్రజలు క్రమంగా దూరమవుతూ వచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై తెలంగాణవాదులు విరుచుకుపడుతూ వస్తున్నారు. రాష్ట్రం విడిపోయినంత ఏమీ జరగదంటూ ఆయన అంటూ వచ్చారు. తెలంగాణకు ఏ విధమైన మేలు జరగదని ఆయన చెబుతూ వచ్చారు. ఆ తర్వాత కాస్తా తెలంగాణకు అనుకూలంగా మారారు. ఇప్పుడు పూర్తిగా సమైక్యవాదం వినిపిస్తున్నారు. దీంతో ఆయనకు తెలంగాణలో ఉన్న ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది.
కోస్తాంధ్రలో గానీ రాయలసీమలో గానీ ఆయన పునాది స్థాయిలో కార్యాచరణను చేపట్టలేకపోయారు. ఆయన విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమానికి సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. క్రమంగా ఆయన ఇతర పార్టీల నాయకుల మాదిరిగా మారిపోయారనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది.