జైరాంతో చర్చపై వెంకయ్య, హైద్రాబాద్ టిదేనని జెడి శీలం
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో కేంద్రమంత్రి జైరామ్ రమేష్తో అర్థవంతమైన చర్చలు జరిగాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు శుక్రవారం చెప్పారు. ఏ అంశాలైనా బిల్లులో నిర్ధిష్ఠంగా పొందుపర్చాలని స్పష్టం చేశామన్నారు.
పోలవరంను బహుళార్ధసాధక ప్రాజెక్టుగా బిల్లులో పొందుపర్చాలని జైరాంను కోరినట్లు చెప్పారు. హైదరాబాదులోని సీమాంధ్రుల అపోహలను తొలగించాలని కోరామని, పది జిల్లాల తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పామన్నారు.
మరోసారి పరిశీలించాలి: జెడి శీలం
విభజన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని తాము కేంద్ర ప్రభుత్వాని కోరుతామని కేంద్రమంత్రి జెడి శీలం అన్నారు. విభజన ప్రక్రియ అసమంజసమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి హైదరాబాద్ జీవధార వంటిదని, 57 ఏళ్లుగా అందరం కలిసి సమష్టిగా అభివృద్ధి చేసుకున్నామన్నారు.
వివిధ రంగాలు హైదరాబాద్ లోనే కొలువై ఉండడంతో, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉద్యోగాన్వేషణకు హైదరాబాద్ వస్తారని అన్నారు. విభజన అంటూ భవిష్యత్ తరాల జీవితాలపై కొట్టకూడదని ఆయన సూచించారు. తెలంగాణ ఇచ్చే తీరు బాలేదని తాము అధిష్ఠానికి తెలిపామని అన్నారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు హైదరాబాదులోనే ఉన్నాయని తెలిపామన్నారు. సీమాంధ్రుల సమస్యలు తెలుసుకునేందుకు అధిష్ఠానం కనీస ప్రయత్నించలేదని ఆరోపించారు. హైదరాబాదును పదేళ్ల పాటు కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్నారు. ఆ తర్వాత హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమే అన్నారు.