టి బిల్లుకు భాషా సమస్య: కేంద్రానికి పంపించాలా లేక..?
శాసన సభలోనే కొందరు అనువాదం చేసే వారు ఉన్నప్పటికీ కీలకమైన, న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉండటంతో ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. అనువాదం తప్పనిసరి అయిన నేపథ్యంలో దీనిని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయించాలా లేక కేంద్రానికి పంపించాలా అనే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును అసెంబ్లీ ముందు ఉంచడం వరకే తమ బాధ్యత అని, దానిని సోమవారం నెరవేరుస్తామని, అనువాదంతో తమకు సంబంధం లేదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చెబుతున్నాయి. రాజ్యాంగ సవరణ, ఇతరత్రా అంశాలపై పార్లమెంటు సెక్రటేరియేట్ నుంచి వచ్చే ప్రతులను అసెంబ్లీ ముందు యథాతథంగానే ఉంచుతామని వాటిని తర్జుమా చేసే బాధ్యతను తీసుకోమని అసెంబ్లీ వర్గాలు వివరిస్తున్నాయి. విభజన బిల్లు విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తామని తెలిపాయి.
ఇంగ్లీషులో వచ్చిన బిల్లునే సభలో ప్రవేశపెట్టి, అనువాదం సంగతి తర్వాత చూద్దామనే ప్రతిపాదన వచ్చినప్పటికీ, అందుకు కొందరు ఎమ్మెల్యేలు అంగీకరించే పరిస్థితి లేదని భావిస్తున్నారు. బిల్లును అనువదించాలా వద్దా? దానిని ఎవరు అనువదించాలి? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే ప్రశ్నలకు సమాధానాలను శాసనసభ వ్యవహారాల సలహా సంఘమే (బిఎసి) కనుగొనాల్సి ఉంటుంది.