మళ్లీ ఆంత్రాక్స్ విజృంభణ...వణుకుతున్న విశాఖ మన్యం:20 రోజుల్లో 23 మందికి!
విశాఖపట్టణం:మళ్లీ విజృంభించిన ఆంత్రాక్స్ ధాటికి విశాఖ మన్యం గజగజ వణుకుతోంది. ఈ ప్రాంతంలో గడచిన మూడేళ్లలో 37 ఆంత్రాక్స్ కేసులు నమోదైతే 2018 సంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలల్లోనే ఈ కేసులు 27 వెలుగుచూశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దానికంటే ప్రమాదకరం ఈ కేసుల్లో తొంభై శాతం పైగా గత 20రోజుల వ్యవధిలోనే బైటపడటం. ప్రస్తుతం 23 మంది ఆంత్రాక్స్ లక్షణాలతో కెజిహెచ్ లో చికిత్స పొందుతుండటాన్ని బట్టి ఈ వ్యాధి విజృంభణ స్థాయి అంచనా వేయొచ్చు. దీంతో మన్యంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ వ్యాధిపట్ల గిరిజనుల్లో అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య, పశుసంవర్థక శాఖలు ఘోరంగా విఫలమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంత్రాక్స్ ఇలా...నేలలో 40 ఏళ్లు
ఆంత్రాక్స్ బ్యాక్టిరియా ద్వారా వ్యాపిస్తుంది. జబ్బు బారిన పడిన పశువును సరైన పద్దతిలో లోతుగా ఖననం చేయకుండా వదిలేస్తే అందులోని బ్యాక్టీరియా అక్కడి నేలలో 40 ఏళ్ల వరకు సజీవంగానే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది సంవత్సరమంతా నిద్రావస్థలో ఉంటూ వర్షాలు పడినప్పుడు ఒక్కసారిగా చలన స్థితిలోకి వస్తుంది. పర్యవసానంగా ఈ బ్యాక్టిరియా ఉన్న ప్రాంతంలో పశు గ్రాసం తినే పశుగణంతో పాటు గడ్డి కోసేవారికి సైతం ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ బ్యార్టీరియా ప్రవేశించిన అనంతరం ఊపిరితిత్తులకు చేరుకోవడంతో అవి కొద్ది రోజుల్లోనే మృత్యువాతన పడతాయి. ఈ వ్యాధిబారిన పడిన పశువును తినడం ద్వారా గిరిజనులు ఎక్కువగా ఆంత్రాక్స్ బారిన పడుతున్నారు.

గిరిజనుల...ఆహారపు అలవాట్ల వల్ల
అయితే గిరిజనులు పూర్వం నుంచి చనిపోయిన పశు మాంసాన్ని తినే అలవాటు ఉంది. పైగా ఇలా జబ్బుతో చనిపోయిన పశు మాంసాన్ని సైతం అవగాహన లేక గిరిజనులు రోజులు తరబడి నిల్వచేసుకుని తింటున్నారు. ఈ అలవాటు కారణంగా ప్రమాదకర వ్యాధుల బారినపడే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ సరైన అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో ఇంకా చాలా తండాల్లో ఈ అలవాటు కొనసాగుతూనే ఉంది. దీనివల్లే ఎక్కువమంది ఆంత్రాక్స్ బారిన పడుతుంటారని విశాఖ పశు సంవర్థకశాఖ ఇన్ఛార్జి జేడీ రామకృష్ణ పేర్కొన్నారు.

తాజాగా...15 కేసులు...ఒకేసారి
విశాఖ మన్యం నుంచి అడపాదడపా ఆంత్రాక్స్ కేసులు వెలుగు చూస్తున్నా ఇక్కడి అధికారులు సాధారణంగానే తీసుకొని చికిత్సలు నిర్వహిస్తున్నారు. అయితే హఠాత్తుగా రెండు రోజుల కిందట గూడెంకొత్తవీధి మండలం మాడేం కాలనీకి చెందిన 15 మంది గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో కేజీహెచ్లో చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీరంతా ఈనెల 14, 17 తేదీల్లో గిరిజనతండాల్లో చనిపోయిన ఐదు ఆవులను ఖననం చేయకుండా వండుకుని తిన్నారని స్థానికులు చెబుతుండటం గమనార్హం. వీరికి చికిత్స అందిస్తుండగానే తాజాగా బుధవారం చింతపల్లి మండలం గొమ్మంగి పంచాయతి గెంజిపేటకు చెందిన మరో నలుగురు ఆంత్రాక్స్ లక్షణాలతో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి రాగా మెరుగైన వైద్యం కోసం వీరిని కూడా కేజీహెచ్కు తరలించారు.

వ్యాధి నిర్థారణకు...2 నెలలు
ఈ జబ్బుపడిన పశువును తినడం వల్లే కాదు ఆ పశువును కోసేవారికి సైతం ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా శరీరంలోకి చేరిపోతుంది. ముందుగా పశువును కోసిన వారికే ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. సరిగ్గా వండకుండా తింటే ఆంత్రాక్స్ బారిన పడే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు రోజుల్లో అంత్రాక్స్ అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారంతా ఇలా పశుమాంసాన్ని కోసినవారే కావడం గమనార్హం. వీళ్లందరికీ చేతులు, కాళ్లపై పుళ్లు పడటం, కురుపులు రావడం వాటి నుంచి రక్తస్రావం జరుగుతోంది. సాధారణంగా ప్రాణాంతకం కాకున్నా ముందుగా మేలుకోకుంటే ఇబ్బందులు తప్పవని విశాఖ ఇన్ఛార్జి డీఎంహెచ్వో వసుంధర తెలిపారు.

సిఎం సమీక్ష...పూణెకు నమూనాలు
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి చర్మవ్యాధుల విభాగంలో మంగళవారం చేరిన 15 మంది ఆంత్రాక్స్ బాధితులు క్రమేపీ కోలుకుంటున్నట్ల ఇక్కడి వైద్యవర్గాలు తెలిపాయి. వీరిలో నలుగురి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో డిశ్చార్జి చేశామని హాస్పటల్ సీఎస్ఆర్ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి తెలిపారు. వీరికి పుండ్లు వచ్చిన చోట చర్మ నమూనాలను సేకరించి ఆంత్రాక్స్ రోగ నిర్ధరణ పరీక్షల కోసం గ్వాలియర్లోని డిఫెన్స్ లేబొరేటరీ, పూణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపుతున్నట్లు వివరించారు. మరోవైపు విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ విస్తరించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమప్తం చేశారు. సిఎం టెలీకాన్ఫరెన్స్ ద్వారా బుధవారం అధికారులతో మాట్లాడుతూ వ్యాధి ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజల్లో పూర్తి అవగాహన తీసుకురావాలని సూచించారు.
-
సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?












Click it and Unblock the Notifications