మతమార్పిడులను అడ్డుకుంటాం: ఏపీ మంత్రి, బాబుకు ముద్రగడ ఘాటు లేఖ
విజయవాడ/చిత్తూరు: నిర్బంధ మతమార్పిడులు అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు బుధవారం చెప్పారు. తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన హిందూ ధార్మిక సదస్సులో ఆయన మాట్లాడారు.
అన్యమాతానికి చెందిన వారు హిందువులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్నారు. మత మార్పిడులను అడ్డుకోవడానికి పీఠాధిపతులు, మఠాధిపతులు కలిసి రావాలన్నారు.
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మాట్లాడుతూ... మత మార్పిడులు నివారించడానికి ఆందరూ ఐక్యం కావాలన్నారు. టిటిడి అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. హిందూ ధర్మ ప్రచారానికి టిటిడి విశేషంగా కృషి చేస్తోందన్నారు.
అద్భుత ప్రగతి: చంద్రబాబు
జపాన్ కంపెనీలతో ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. జపాన్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడితే అద్భుత ప్రగతి సాధ్యమన్నారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు కీలకమైనవని చెప్పారు. రెండంకెల దిశగా దూసుకుపోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్నారు.
చంద్రబాబు అంతకుముందు దెందులూరులో జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన హైదరాబాదుకు బయలుదేరారు. టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి తనయుడి వివాహ వేడుకకు ఆఈయన హాజరు కానున్నారు.
చంద్రబాబుపై మండిపడ్డ ముద్రగడ
ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెండు పేజీలతో ఘాటు లేఖ రాశారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని అమలు చేయమంటే కాలయాపన ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు.
దానిని అడుగుతుంటే తప్పును ఎవరి మీదకో తోసేయడం సరికాదన్నారు. నేరం ఇతరుల పైకి తోయడం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అభిప్రాయపడ్డారు. ఎదురు దాడి చేయించడం దేనికని ప్రశ్నించారు. తమ ఉద్యమం (కాపు ఉద్యమం) వెనుక ఎవరో ఉన్నారని చంద్రబాబు చెబుతున్నారని.. అలా అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను చేసిన ఉద్యమాలన్నీ మీ మద్దతుతో చేసినవేనా అని ప్రశ్నించారు.
వంకర మాటలు తగ్గించాలన్నారు. కాపుల జనాభా, ఇతర వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు కమిషన్ పేరిట కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే నెల రోజుల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అవకాశముందన్నారు. లేదంటే వచ్చే నెల 31న తునిలో నిర్వహించనున్న కాపుల సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.