చానెళ్ల బ్యాన్: కేంద్రం లేఖకు కెసిఆర్ ప్రభుత్వం రిప్లై
హైదరాబాద్: తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 టీవీ చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్రం రాసిన లేఖకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రభుత్వం సమాధానం రాసింది. ఆ టీవీ చానెళ్ల ప్రసారాల నిలిపివేతలో తమ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది.
టీవీ చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ బిమల్ జుల్కా రాసిన లేఖకు కెసిఆర్ ప్రభుత్వం జవాబు రాస్తూ - ఎంఎస్ల ద్వారా టీవీ చానెళ్ల ప్రసారాలను తాము నిలిపేసిన మాట వాస్తవం కాదని చెప్పింది. తెలంగాణలో టీవీ చానెళ్ల ప్రసారాల నిలిపేయాలని ప్రభుత్వం ఎంఎస్వోకు గానీ సంఘాలకు గానీ సూచించిందలేదని, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్, ఇతర ఏ చానెల్ ప్రసారాలను కూడా ఆపేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.
తెలంగాణ సమాచార, పౌరసంబంధాల కమిషనర్ ఆర్వి చంద్రవదన్ తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి జవాబు పంపించారు. రెండు టీవీ చానెళ్లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిందని ఎబిఎన్, టీవి9 సంస్థల ప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి ప్రకాష్ జవదేకర్కు ఇటీవల ఫిర్యాదు చేశారు.
చానెళ్ల ఆరోపణలను ఖండిస్తూ ప్రజలను సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చైతన్యవంతులను చేయడానికి ఎలక్ట్రానిక్ మీడియాకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చే అంశం, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చే అంశం మాత్రమే తమ చేతుల్లో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. న్యూస్, కరెంట్ అఫైర్స్ అప్లింగ్, డౌన్లింక్కు అనుమతి, ఎంఎస్వో నమోదుకు అనుమతి కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పరిధిలోనిదని స్పష్టం చేశారు. ప్రసారాల నియమాలను ఎంఎస్వో, టీవి చానెల్ పరస్పర అంగీకారంతో రూపొందించుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది.