3 నెలల్లో ప్రతి వీధికి సెన్సార్లు...సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీసింగ్:సిఎం చంద్రబాబు
అమరావతి:గ్రామదర్శినిలో ఈ సంవత్సరం డిసెంబర్ నెలనాటికల్లా ప్రజా సమస్యలు అన్నీ పరిష్కరించబడాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన గ్రామదర్శినిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 3 నెలల్లో ప్రతి ఇంటికి డోర్ నెంబర్, ప్రతి వీధికి సెన్సార్లు ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీసింగ్ వ్యవస్థ మరింత పటిష్టం కావాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమస్యలు...తీరిపోవాలి
అలాగే రోడ్ల మీద మురుగునీరు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని, డ్రెయిన్ల నిర్మాణం ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలు తినే తిండి, తాగే నీరు, పీల్చేగాలి స్వచ్ఛంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామదర్శినిలో ప్రజలందరి సమస్యలు తీర్చాలన్నదే తన అభిమతమని సిఎం చంద్రబాబు చెప్పారు.
Recommended Video
ఇదే మా పాలనపై...నమ్మకం
కేంద్రం ఎపి రాజధానికి రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని, అదే బాండ్ల రూపంలో ఒక్క గంటలోనే రూ.2 వేల కోట్లు వచ్చాయన్నారు. తమ పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకున్నా రాజధాని నిర్మాణం ఆగదన్నారు.
పార్టీలో...చేరికలు
ఇదిలావుండగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ లో చేరారు. విజయనగరం, చిత్తూరు జిల్లాల వైసీపీ నేతలు, కార్యకర్తలను స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబే టీడీపీలోకి ఆహ్వానం పలికారు. అలాగే పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ వైసీపీ నేతలకు కూడా చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్వతీపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు శ్రీనివాసరావు, జ్యోతి, సీనియర్ నేత సత్యనారాయణ, పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు.
ప్రకాశం బ్యారేజీ...సెల్ఫీ పాయింట్
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మన అమరావతి సెల్ఫీ పాయింట్ను సిఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. డిసెంబర్ నాటికి నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖలు మారిపోతాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇదే ప్రాంతంలో భారీ జాతీయ పతాకం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెల్ఫీలకు చిరునామాగా మన అమరావతి పాయింట్ ఉంటుందని సిఎం చంద్రబాబు చెప్పారు.