జగన్...పాదయాత్రకు ఇంకో దారి చూసుకోండి:అదేం బాగాలేదు
తూర్పు గోదావరి:వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకు అనుకోని అవాంతరం వచ్చి పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న మరో రెండు రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించనున్నారు.
అయితే జగన్ జిల్లా ముఖ ద్వారంగా ఉన్న రోడ్ కం రైల్ బ్రిడ్జి మీదుగా కాకుండా మరో మార్గంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోకి అడుగుపెట్టాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు వైసిపి నేతలకు నోటీసులు కూడా సర్వ్ చేశారు. ఈ బ్రిడ్జి పరిస్థితి బాగోనందునే ఈ సూచన చేసినట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు వైసిపి శ్రేణులు పోలీసుల సూచన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టనుంది. అయితే జిల్లాలోకి జగన్ ప్రవేశం సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున జన శ్రేణులు జిల్లా సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పాదయాత్ర చేసేందుకు జిల్లా ముఖ ద్వారంలో ఉన్న రోడ్ కం రైల్ బ్రిడ్జి కండిషన్ బాగోలేదని, ఇంకో మార్గం చూసుకోవాలని తూర్పు గోదావరి అర్బన్ జిల్లా సౌత్జోన్ డీఎస్పీ భరత్మాతాజీ వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.
జగన్ పాదయాత్ర కోసం అలాగే రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండు వద్ద సభ కోసం అనుమతి కోరుతూ వైసీపీ నగర కో-ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు అర్బన్ జిల్లా పోలీసులకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన డీఎస్పీ ఆ రోడ్ కం రైలు బ్రిడ్జి 50 ఏళ్ల క్రితం నాటిదని, దాని కండిషన్ అంత బాగా లేదని తెలుపుతూ అందుకు పరిష్కారంగా రెండు ప్రత్యామ్నాయాలు సూచించారు. ఒకటి పోలీసులు సూచించిన విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పాదయాత్ర చేయడం...లేదా ఈ దారి కాకుండా మరో మార్గంలో జిల్లాలోకి ప్రవేశించడం!
కారణం ఈ రోడ్ కం రైల్ బ్రిడ్జి పెట్రోల్ వాల్స్ కండిషన్ సరిగాలేకపోడమేనని నోటీసులో వివరించారు. ఏదైనా తేడా జరిగితే బ్రిడ్జి కుప్పకూలే ప్రమాదం ఉందని పోలీసులు నోటీసులో హెచ్చరించినట్లు తెలిసింది.
అయితే వైసిపి శ్రేణులు మాత్రం పోలీసుల స్పందన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ తూర్పు గోదావరి జిల్లా రాక సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికే అవకాశం ఉందని...అయితే జగన్ కు ప్రజాదరణ ఓర్వలేక టిడిపి ప్రభుత్వం పోలీసుల ద్వారా కావాలని పోలీసుల ద్వారా ఇలా దారి మళ్లింపు కుట్ర పన్నినట్లు వైసిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి. అందుకే జాగ్రత్తలు పాటించైనా సరే జగన్ పాదయాత్రను రోడ్ కం రైల్ బ్రిడ్జి ద్వారా నే కొనసాగించాలని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.