ఈ పాచిక పారుతుందా?: పీకె ఇప్పుడైనా సక్సెస్ అవుతాడా!, జగనే గుడ్డిగా నమ్ముతున్నాడా..
ఇలాంటి తరుణంలో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం పీకేకు అనివార్యమైంది.
Recommended Video
విజయవాడ: ఏరి కోరి మరీ తెచ్చుకున్న పీకే వైసీపీకి ప్లస్ అయ్యారా? మైనస్ అయ్యారా? అంటే.. ఇప్పటిదాకా పార్టీ ఎదుర్కొన్న పరిస్థితులను చూస్తే మాత్రమే ప్రతికూల సమాధానమే వస్తోంది. ఆయన పార్టీతో జత కలిసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ పార్టీకి బూస్టింగ్ ఇవ్వలేకపోయారు.
వాట్ నెక్స్ట్: వైసీపీ ఫ్యూచర్ స్ట్రాటజీ?, మళ్లీ అదే తప్పా.. టీడీపీకి అది ప్లస్!
ముఖ్యంగా నంద్యాల ఉపఎన్నికలో పీకే తెర వెనుక వ్యూహాలు ఆ పార్టీకి విజయాన్ని ఖాయం చేస్తాయని చాలామంది భావించారు. కానీ ఫలితం పూర్తిగా బెడిసికొట్టడంతో ఆయన సామర్థ్యంపై లేని పోని అపోహలు పెంచుకున్నామని సొంత పార్టీ నేతలే వాపోతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం పీకేకు అనివార్యమైంది.
పీకె ప్లాన్ ఏంటి?:
నంద్యాల, కాకినాడల ఓటమి నుంచి పీకె ఏం గ్రహించారో తెలియదు కానీ ఢీలా పడ్డ వైసీపీని పట్టాలెక్కించెందుకు తెర వెనుక గట్టి వ్యూహాలే రచిస్తున్నారట. తాజాగా వైసీపీ చేపడుతున్న 'వైయస్సార్ కుటుంబంలో భాగమవ్వండి' కార్యక్రమం కూడా పీకె ఆలోచనే అని చెబుతున్నారు.
వైఎస్ అభిమానులను, ఆయన పథకాల ద్వారా లబ్దిపొందిన వారిని వైసీపీ ఓటు బ్యాంకుగా మార్చడం కోసం పీకె ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేవలం సెంటిమెంటుతోనే పార్టీని బలోపేతం చేయాలనుకోవడం ఎంతవరకు ఫలిస్తుందనేది అనుమానమే.
కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా తాము ఏర్పాటు చేసిన నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సమస్యలు చెప్పుకోవాల్సిందిగా వైసీపీ ప్రజలను కోరుతోంది. వైసీపీలో కోటి మందినే భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంచకున్నారు. అయితే ప్రజల నుంచి దీనికి ఎలాంటి మద్దతు లభిస్తుందనేది ఇంకా తెలియరాలేదు.
పీకె నిఘా:
నంద్యాల, కాకినాడ ఓటమిలతో నిమిత్తం లేకుండా.. పార్టీ విషయంలో జగన్ పీకెకు పూర్తి స్వేచ్చనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలోని కీలక నాయకులు, ముఖ్య కార్యకర్తలపై పీకె నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కుటుంబ కార్యక్రమాన్ని జనంలోకి వాళ్లు తీసుకెళ్లే తీరు, ప్రజలతో వాళ్లు ఎలా మసులుకుంటున్నారు? వంటి విషయాలన్ని గమనించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని పీకె ఏర్పాటు చేశారట. ఈ ఒక్క కార్యక్రమానికే పరిమితం కాకుండా.. వచ్చే ఎన్నికల వరకు ఈ టీమ్ నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు పీకెకు రిపోర్టులు పంపిస్తుందని చెబుతున్నారు. ఆ రిపోర్టులను పీకె జగన్కు అందిస్తారు.
నేతల అసంతృప్తి, గుడ్డిగా నమ్ముతున్నాడని?:
ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నవారి మీద ఇలా నిఘాలు పెట్టడమేంటని సొంతగూటి నుంచి ప్రశ్నలు తలెత్తుతుండటం వైసీపీకి కొత్త తలనొప్పిగా మారిందంటున్నారు. పీకె ఇచ్చే నివేదికలపై నమ్మకం లేకనే వారు ఈ కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పీకె కొత్త ప్లాన్ కూడా వైసీపీకే చేటు చేస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అధినేతకు తమకు మధ్య పీకె రాయబారాన్ని వారు ఏమాత్రం సహించడం లేదని తెలుస్తోంది. ఏదైనా ఉంటే.. అధినేతే తమతో నేరుగా తేల్చుకోవాలని, పీకె పనితీరు, సామర్థ్యంపై తమకు నమ్మకం లేదని వైసీపీ నేతలు వాపోతున్నట్లు సమాచారం. ఒకవిధంగా జగన్ ఆయన్ను గుడ్డిగా నమ్ముతున్నారన్న అభిప్రాయాలు వారిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
సెంటిమెంటు వర్కౌట్ అవుతుందా?:
సెంటిమెంటుతో వైఎస్ అభిమానులను పార్టీ గొడుగు కిందకు తీసుకురావాలన్న ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. పార్టీ బలోపేతానికి కేవలం వారినే నమ్ముకోవడం కూడా సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఓటు బ్యాంకును గురిపెడితే తప్ప వైసీపీ విజయావకాశాలు మెరుగుపడవనే వాదన వినిపిస్తోంది.
అయితే తాజాగా చేపట్టిన వైయస్సార్ కుటుంబం కార్యక్రమం పట్ల పీకె కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. పీకె నమ్ముతున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా వైసీపీకి జనం మద్దతు పెరిగితే పార్టీలోను అతని పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్న అసంతృప్తులకు కూడా చెక్ పెట్టవచ్చు. కానీ ఇక్కడ పీకె సక్సెస్ అవుతారా? లేరా? అన్నదే పెద్ద ప్రశ్న.
మరోవైపు ఇప్పటిదాకా తనని తాను ప్రూవ్ చేసుకోలేకపోయిన పీకె.. ఇకముందైనా విమర్శలకు చెక్ పెడుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా నిరూపించుకోవడానికి పీకె ముందున్న మార్గాలేవి లేవు.
ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీల హవా కొనసాగడం ఏళ్లుగా జరుగుతున్నదే అని చెప్పి వైసీపీ తన ఓటమికి సాకులు వెతికింది. ఇప్పుడంటే సాకులు చెప్పుకోవచ్చు కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తాడో పేడో తేల్చుకోక తప్పదు. కాబట్టి వైసీపీకి పీకె మళ్లీ సాకులు వెతికే దుస్థితిని కల్పిస్తారా?.. లేక పార్టీకి విజయాన్ని కట్టెబెడుతారా? అన్నది వేచి చూడాలి.