రైల్వే టికెట్ రద్దు చార్జీలు రెట్టింపు: అరగంట ముందు కూడా రిజర్వేషన్
విజయవాడ: రైల్వే ప్రయాణికులకు చేదువార్త. టికెట్ రద్దు చార్జీలను రైల్వేశాఖ రెట్టింపు చేసింది. పెంచిన రద్దు ఛార్జీలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇకపై టిక్కెట్లను రద్దు చేసుకోవాలని భావించే ప్రయాణికులు రైలు ప్రయాణ షెడ్యూల్కు 4 గంటల ముందే రద్దు చేసుకొంటేనే నిర్ణీత ఛార్జీలను మినహాయించుకొని టికెట్ డబ్బులిస్తారు.
రైలు బయలుదేరే సయమానికి 48 గంటలు నుంచి 12 గంటల లోపు రద్దు చేసుకొంటే టికెట్ మొత్తంలో 25 శాతాన్ని ర్దదు ఛార్జీగా మినహాయించుకుంటారు. 12 గంటల నుంచి 4 గంటల ముందు రద్దు చేసుకొంటే 50 శాతాన్ని రద్దు ఛార్జీగా మినహాయించుకుంటారు.
రద్దు ఛార్జీల వివరాలు ఇవే
ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ రద్దు చార్జి రూ.240, సెకండ్ క్లాస్ ఏసీ టికెట్ రద్దు చార్జి రూ.200, థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ రద్దు చార్జి రూ.180, సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్ రద్దు చార్జి రూ.120, సెకండ్ క్లాస్ టికెట్ రద్దు చార్జి రూ.60.
వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లు రద్దు చేసుకోవాల్సిందే
వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లు, ఆర్ఏసీ టికెట్లపై ప్రయాణ చేయకుంటే టికెట్ మొత్తంలో కొంత మొత్తాన్ని మినహాయించుకొని సదరు ప్రయాణికుల ఖాతాలో జమ చేసేవారు. ఇకపై ప్రయాణ షెడ్యూల్కు అరగంట ముందు రద్దు చేసుకొని సొమ్ము పొందాలి. టికెట్ రద్దు చేసుకోకుంటే డబ్బు తిరిగి రాదు.
రైలు బయలుదేరడానికి అరగంట ముందు కూడా రిజర్వేషన్
ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగించేలా రైల్వే అధికారులు రిజర్వేషన్ల విధానంలో మార్పులు చేశారు. రైలు బయలుదేరడానికి అరగంట ముందు కూడా బెర్తలు లభ్యతను బట్టి ఆన్లైన్లో గానీ, టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో గానీ టికెట్ బుక్ చేసుకునే వీలు కల్పించారు.
ఈ విధానం కూడా గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. రైలు బయలుదేరడానికి ముందు నాలుగు గంటల ముందు రిజర్వేషన్ జాబితాను తయారు చేయడంతో కొన్నిసార్లు సీట్లు మిగిలిపోయేవి. రిజర్వేషన్ జాబితా తయారీలో జాప్యం వల్ల అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రయాణీకుల అవకాశాలు పెంచడం, సంస్థకు ఆదాయం పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రిజర్వేషన్ టికెట్లు దొరకని వాళ్లు రైలు వద్ద టీటీఈని బతిలాడుకుని బెర్తులు పొందాల్సిన పనిలేదు. బెర్తుల వివరాలను ఆన్లైన్లో చూసుకుని బుక్ చేసుకోవచ్చు.
సాంకేతిక లోపంతో నిలిచిన శాతవాహన ఎక్స్ప్రెస్
విజయవాడ నుంచి సిక్రింద్రాబాద్ వెళ్లాల్సిన శాతవాహన ఎక్స్ప్రెస్ శుక్రవారం ఉదయం మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగానే రైలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అర్థగంటకు పైగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాజీపేట జంక్షన్ నుంచి మరో రైలు ఇంజిన్ తెప్పించి అమర్చడంతో శాతవాహన ఎక్ర్ప్రెస్ మహబూబాబాద్ నుంచి బయలుదేరింది.