టిడిపిలోకి రాయపాటి: తోట నర్సింహం కూడా
హైదరాబాద్ : గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో రాయపాటి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. నరసారావుపేట నియోజక వర్గం నుంచి రాయపాటి టిడిపి తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు నరసారావుపేట సిటింగ్ టిడిపి పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డిని గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలియవచ్చింది.
రాయపాటి సాంబశివ రావు ప్రస్తుతం గుంటూరు పార్లమెంటు సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆ సీటును ఇప్పటికే చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్కు కేటాయించారు. గల్లా జయదేవ్ ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివ రావు సీటు మారబోతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాయపాటి సాంబశివ రావు సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో ఆయన చేరుతారని ప్రచారం సాగింది. ఆయితే, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అందుబాటులో లేకుండా పోయారు. చివరకు తెలుగుదేశం గూటిలోకి చేరుకోవాలని రాయపాటి నిర్ణయించుకున్నారు.
కాగా, మాజీ మంత్రి తోట నర్సింహం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట నర్సింహం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయన కూడా టిడిపిలో చేరబోతున్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.