ఒంటరిగా ఎలా ఎంతకాలం: బిజెపిలో చేరిన హీరో శివాజీ
హైదరాబాద్: ప్రముఖ నటుడు శివాజీ గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పటికే పలువురు నటులు బిజెపి వైపు చూస్తున్నారు. నటుడు సురేష్ బుధవారం కమలతీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు శివాజీ ఆ పార్టీలో చేరారు. పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శివాజీతో పాటు ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ కమలతీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడారు. ఈ మధ్య కొందరు తెలంగాణను నిర్మించాలి... ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలని చెబుతున్నారని, మొదట భారత్ను నిర్మించాల్సిన అవసరముందన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇంకా దేశంలో పేదరికం ఉందంటే నాయకులు సిగ్గుపడాలన్నారు. తాను పదవుల కోసం బిజెపిలో చేరడం లేదన్నారు. సినిమా పరిశ్రమలో తనకు అవకాశాలు ఉన్నాయని, దేశం బాగు కోసమే చేరానన్నారు.
తాను వెంకయ్య వద్దకు వెళ్లి జాతీయ పార్టీలో చేరాలని ఉన్నట్లు చెప్పానని తెలిపారు. మనిషికి నీరు ఎంత అవసరమో... ఇప్పుడు దేశానికి మోడీ అంత అవసరమన్నారు. పదవుల కోసం ఎవరు పార్టీలలో చేరాల్సిన అవసరం లేదని, కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. సమస్యలపై తాను రెండేళ్లుగా ఫైట్ చేస్తున్నానని, ఇంకా ఒంటరిగా ఎంతకాలం చేయాలన్నారు. బిజెపి వస్తే సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బిజెపిలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో బిజెపి ప్రభంజనం తప్పదని సర్వేలన్నీ చెబుతున్న వేళ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మరికొందరు కూడా క్యూ కడుతున్నారని అంటున్నారు. పవన్ మద్దతు ప్రకటించడం, సురేష్ పార్టీలో చేరడం, అక్కినేని నాగార్జున గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడం తెలిసిందే. దీంతో మరో ముఖ్య నటుడు బిజెపిలో చేరుతారనే ప్రచారం రెండు మూడు రోజులుగా జరుగుతోంది.
ఆ నటుడు మోహన్ బాబే కావొచ్చని వార్తలు వచ్చాయి. రెండు, మూడు రోజుల్లో సంచలన ప్రకటన చేస్తానని మొన్న తిరుపతిలో మోహన్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కూడా బిజెపిలోకి చేరాలని ఉవ్విళ్లూరుతున్నట్టుగా వార్తలు వచ్చినా ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో శివాజీ తెరపైకి రావడం గమనార్హం.
కాగా, పవన్ కళ్యాణ్ ప్రసంగంపై శివాజి స్పందించిన విషయం తెలిసిందే. తనకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించే విధానం తనకు నచ్చిందని శివాజీ తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్ విధానాలు తనకు అర్థం కాలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏ విధానాలకు కట్టుబడ్డారో తనకు అర్థం కాలేదని శివాజీ తెలిపారు. అయితే, విప్లవ వీరుడు చేగువేరా అంటే ఇష్టమని చెప్పుకునే పవన్.. భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగించిందన్న శివాజీ.. బిజెపిలో చేరనున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.