విజయవాడ కేంద్రంగా సిమి: 15మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
హైదరాబాద్/విజయవాడ: ఉగ్రవాద సంస్థ సిమి తన కార్యకలాపాలకు విజయవాడను కేంద్రంగా ఉపయోగించుకుంటోంది. ఇటీవల మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి నల్గొండకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, సిమి కార్యకలాపాలపై దృష్టి పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విజయవాడలో ఐదు రోజుల క్రితం 15 మందిని అదుపులోకి తీసుకుంది. కాగా, ఇందులో 11 మందిని విచారించి వదిలేసింది. మరో నలుగురు ఎన్ఐఏ అదుపులోనే ఉన్నారు. వారి నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు సిమి ఉగ్రవాదులు అస్లాం, ఎజాజ్లు నిరుడు అక్టోబర్లో మరో ముగ్గురు విచారణ ఖైదీలతో కలిసి మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దికాలంలోనే అందులో ఇద్దరు ఖైదీలు పోలీసులకు పట్టుబడ్డారు.
అప్పటినుంచి దేశవ్యాప్తంగా తిరుగుతున్న అస్లాం, ఎజాజ్లు ఇటీవల తెలంగాణలో అడుగుపెట్టారు. ఇలా వీరు ముఠాగా ఏర్పడి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు, మెదక్ జిల్లా రామచంద్రాపురంలో బంగారం కుదువపెట్టుకుని రుణాలిచ్చే ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో చోరీలకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కళ్లుకప్పి కొంతకాలంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరో ఇద్దరు కూడా వీరి బృందంలో చేరారని కనుగొన్నారు. సంగారెడ్డి కేంద్రంగా విజయవాడ, గుంటూరులో బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్లాన్ అమలు చేసేందుకు వెళ్తూనే ఈనెల ఒకటో తేదీన అర్ధరాత్రి సూర్యాపేట బస్టాండ్లో తనిఖీలు జరుపుతున్న పోలీసుల కంటపడ్డారు.
పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వారిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో దుండగులు మృతిచెందిన విషయం తెలిసిందే. సూర్యాపేటలో పోలీసుల కంటపడక ముందే మార్చి 28 నుంచి 30 తేదీల్లో దుండగులు విజయవాడ, గుంటూరులో పర్యటించినట్లు సమాచారం. అక్కడ దోపిడీకి అనువుగా ఉన్న పలు బ్యాంకుల్లో రెక్కీ సైతం నిర్వహించి ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది.
ఆంధ్ర కొత్త రాజధాని విజయవాడ- గుంటూరు పరిసర ప్రాంతాల్లో నిర్ణయించడంతో ఈ మధ్యకాలంలో అక్కడ కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. అందుకే దుండగులు ఆ రెండు పట్టణాలను టార్గెట్ చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెక్కీ పూర్తి చేసిన అనంతరం తిరిగి సంగారెడ్డికి చేరుకుని ఆయుధాలతో విజయవాడకు బయలుదేరారు.
ఈ క్రమంలోనే సూర్యాపేటలో పోలీసుల కంటపడడంతో ప్లాన్ అడ్డం తిరిగి ఎన్కౌంటర్లో మృతిచెందారు. సూర్యాపేటలో పోలీసు తనిఖీల్లో దుండగులను గుర్తించకుంటే విజయవాడ, గుంటూరు జిల్లాల్లో బ్యాంకు దోపిడీకి పాల్పడి ఉండేవారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.