ఏపీ మాటేది? రెండ్రోజుల్లో కీలక నిర్ణయం: బడ్జెట్పై సోమిరెడ్డి, ఆ రెండే తెలుసంటూ జగన్పై నిప్పులు
అమరావతి: కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరగలేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
విభజన సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం లభిస్తుందని అనుకున్నా.. అలాంటిదేం జరగలేదని అన్నారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.
రెండ్రోజుల్లో నిర్ణయం
రాజధాని అమరావతికి ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదని మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 13వ షెడ్యూల్ సంస్థలకు అరకొర నిధులు కేటాయించారని అన్నారు. పార్లమెంటరీ భేటీ, కేబినెట్ భేటీలోనూ ఈ అంశాలపై గట్టిగా చర్చిస్తామని, ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని సోమిరెడ్డి చెప్పారు.
బెంగళూరు, ముంబైలా అమరావతి కాదా?
బెంగళూరు, ముంబైపై చూపిన ప్రేమను అమరావతిపై కూడా చూపాల్సిన అవసరం ఉందని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల కేంద్ర సానుకూలంగా స్పందించకుంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరకుంటే అవసరమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఏపీ ప్రయోజనాలు, అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు.
అమరావతి పేరెత్తలేదు
శుక్రవారం కేబినెట్ మంత్రుల సమావేశం, ఎల్లుండి పార్లమెంటరీ పార్టీ భేటీ ఉందని, ఈ సమావేశంలో జైట్లీ బడ్జెట్పై పూర్తి స్థాయిలో చర్చిస్తామని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో అమరావతి పేరు కూడా ఎత్తలేదని అన్నారు. ఎంపీలు, మంత్రులు తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నారని చెప్పారు.
చంద్రబాబు రాజీపడలేదు
ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే విషయంలో చంద్రబాబు ఎప్పుడూ రాజీ పడలేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ చుట్టూ ఎన్ని ప్రదిక్షణలు చేసినా న్యాయం చేయలేదని అన్నారు. జైట్లీ.. ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు.
తమ అసంతృప్తిని తెలియజేస్తామని అన్నారు.
కేంద్రంపై ప్రశంసలు.. మాపై విమర్శలా?
కేంద్రం ఇప్పటికైనా వెంటనే స్పందించాలని, మిత్రమైనా తాము పోరాడుతున్నామని సోమిరెడ్డి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు తమను ప్రశ్నించే అర్హత లేదని అన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా.. కేంద్రంపై ప్రశంసలు కురిపించిందని అన్నారు. నిన్నగాక మొన్న పార్లమెంటు బయటికి వచ్చి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోందని కితాబిచ్చారని అన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్సే
రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా తమను విమర్శిస్తోందని మంత్రి సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా నిర్విరామంగా కష్టపడుతున్న చంద్రబాబునాయుడు.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదన్నారు.
కేంద్రం కాళ్లు పట్టుకుని..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రం కాళ్లు పట్టుకుని.. తమను విమర్శించడం ఏంటని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించారని అన్నారు. అలాంటప్పుడు టీడీపీపై ఆరోపణలు ఎందుకని ప్రశ్నించారు. కేంద్రం న్యాయం చేయడం లేదని వైసీపీ మాట్లాడాలని అన్నారు.
జగన్కు ఆ రెండే తెలుసు
మిత్రపక్షంగా తాము తెచ్చిన ఒత్తిడి మీరు తెచ్చారా? అంటూ వైసీపీని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు రాకుండా చేస్తున్నారని అన్నారు. రాజకీయం, సీఎం సీటు తప్ప మీకేం తెలియదు అంటూ వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సోమిరెడ్డి విమర్శలు చేశారు.