మోడీ ప్రసంగంలో ఏమీలేదు, తెలంగాణకు ఎలా ఇస్తారు: కేంద్రంపై బాబు ఆగ్రహం
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో సానుభూతి మినహా హామీలపై ఎలాంటి స్పష్టత లేదని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పార్లమెంటులో నిరసనలు కొనసాగించాల్సిందేనని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. బుధవారం టిడిపి ఎంపీలు సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే.
Recommended Video
తలుపులేసి ఏపీని విభజించారు, మీ అవమానంవల్లే ఎన్టీఆర్ పార్టీ: లోకసభలో మోడీ సంచలనం, ఎంపీలపై అసహనం
వారితో ప్రధాని ప్రసంగానికి ముందు, ఆ తర్వాత చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుంటే ప్రజలు సంతృప్తిపడే పరిస్థితి లేదన్నారు. కేంద్రానికి ఈ విషయం అర్థమయ్యే వరకు పార్లమెంటులో నిరసనలు ఉండాలన్నారు.
చంద్రబాబు అసహనం
ఆంధ్రప్రదేశ్ అజెండాను జాతీయ స్థాయి అజెండాగా మార్చామని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని చంద్రబాబు అన్నారు. ఆర్థిక లోటు భర్తీపై ఇప్పుడు కొత్త ఫార్ములా ప్రస్తావన ఏమిటన్నారు. భౌగోళిక ప్రాతిపదికన ఆస్తులు, జనాభా ప్రాతిపదికన అప్పులు, వినియోగం ప్రాతిపదికన విద్యుత్, జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల పింఛన్లు విభజించిన కేంద్రం, ఇప్పుడు ఏపీకి తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీపై కొత్త ఫార్ములా కోసం ఎదురు చూస్తున్నామనడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా ఎలా కొనసాగిస్తున్నారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని ప్రకటించి, ఈశాన్య రాష్ట్రాలకు ఎలా ప్రత్యేక హోదాను కొనసాగిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన చట్టం అమలును, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీల అమలును సమీక్షించాలని, ప్యాకేజీ అమలు, బడ్జెట్లో కేటాయింపులపైనా సమీక్షించాలన్నారు. అయిదో అంశంగా పార్లమెంటు సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయంపై రెండుగంటల పాటు ఉభయసభల్లో చర్చించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణకు ఎలా ఇస్తారు
2020 నాటికి కూడా ఆర్థికలోటులో ఉండే పెద్ద రాష్ట్రం ఏపీ అని, రాబోయే ఐదేళ్లలో రూ.22 వేల కోట్లు ఇచ్చినా ఆర్థిక లోటు పూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని చంద్రబాబు గుర్తు చేశారు. భౌగోళిక ప్రాతిపదికన సింగరేణిలో 51 శాతం ఈక్విటీ తెలంగాణకు ఇచ్చి, భౌగోళికంగా కృష్ణా జిల్లాలో ఉన్న ఆ సంస్థ సబ్సిడరీని కూడా తెలంగాణకే ఇవ్వడం ఏమిటన్నారు. కేంద్రం చేసిన తప్పునకు రాష్ట్ర ప్రజలను శిక్షించడం ఏరకమైన న్యాయమన్నారు.
లాలూచీ పడటమే వైసీపీకి తెలుసు
ప్రధాని మోడీ సభా నాయకుడు కాబట్టి ఆయన మాట్లాడే సమయంలో మర్యాద ఇవ్వాలని చంద్రబాబు ఎంపీలకు ప్రధాని మాట్లాడడానికి ముందు సూచించారు. మోడీ ప్రసంగం పూర్తయ్యాక ఎంపీలతో మాట్లాడూతు.. మోడీ ప్రసంగంలో ఏమీ లేదన్నారు. వైసీపీ పైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలూచీలో వైసీపీ నెంబర్ వన్ అన్నారు. విభజనలో జగన్ విధానమే లాలూచీ అన్నారు. లాలూచీ పడే బెయిల్ తెచ్చుకున్నారని, ఇప్పుడు కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నారన్నారు.