చంద్రబాబు లేకుంటే సాధ్యమయ్యేదా, ఇప్పుడు ఏపీలోనే: రాజ్నాథ్
ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం లేకుంటే ఇక్కడ (కృష్ణా జిల్లా కొండపావులూరు) ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఏర్పాటు సాధ్యం కాకపోయి ఉండేదని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం అన్నారు.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం లేకుంటే ఇక్కడ (కృష్ణా జిల్లా కొండపావులూరు) ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు నివారణ సంస్థ) బెటాలియన్ ఏర్పాటు సాధ్యం కాకపోయి ఉండేదని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం అన్నారు.
ఎన్డీఆర్ఎఫ్ తక్కువ సమయంలోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొందని రాజ్నాథ్సింగ్ చెప్పారు. సోమవారం కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ భవనాల నిర్మాణానికి ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు.
రాజ్నాథ్ సింగ్
ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండపావులూరు చేరుకున్నారు. శంకుస్థాపన అనంతరం రాజ్నాథ్ మాట్లాడారు. ప్రపంచంలో ఎన్డీఆర్ఎఫ్ గురించే చర్చ జరుగుతోందన్నారు.
నేపాల్ భూకంపం
నేపాల్లో పెను భూకంపం సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సేవలందించిందని గుర్తు చేశారు. అలాగే అక్కడ శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించడమే కాకుండా, మృతదేహాలను వెలికితీసి ప్రశంసల్ని అందుకొందన్నారు.
చంద్రబాబు సహకారం
ఎన్డీఆర్ఎఫ్కు మరిన్ని మౌలిక వసతులు అవసరం ఉందని, బెటాలియన్ల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ కూడా ఉన్నట్టు చెప్పారు. చంద్రబాబు సహకారం లేకుంటే ఇక్కడ ఏర్పాటు కాకపోయి ఉండేదన్నారు.
ఏపీలోనే ఇక ఎన్డీఆర్ఎఫ్
ఏపీలో తుఫాన్లు, కరువు వచ్చినప్పుడు చెన్నై నుంచి ఎన్డీఆర్ఎప్ బృందాలు వస్తున్నాయని చెప్పారు. ఏటా రెండు మూడు తుఫాన్లు ఎదుర్కోవాల్సి వస్తున్నందున ఏపీలోనే బెటాలియన్ ఏర్పాటు చేయడం వల్ల త్వరగా సహాయ చర్యలు చేపట్టవచ్చన్నారు. విశాఖలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కోసం అరవై ఎకరాలు కేటాయించామని, రాష్ట్రానికి గ్రేహౌండ్స్ సెంటర్ అవసరముందని చంద్రబాబు తెలిపారు.