టీడీపీలో చేరి నాశనమయ్యా.. ఆ ఎమ్మెల్యే త్వరలోనే అవుట్?: బాంబు పేల్చిన ఎమ్మెల్యే
అమరావతి: నిన్న మొన్నటిదాకా రాష్ట్రంలో పరిస్థితులన్నీ టీడీపీకి అనుకూలంగా సాగిన వైనం. ఒక్కసారిగా ఈ పరిస్థితుల్లో పెద్ద మార్పే వచ్చినట్టు కనిపిస్తోంది. కేంద్రంతో ఎటూ తేల్చుకోలేక ఇప్పటికే తలపట్టుకున్న టీడీపీకి.. కొంతమంది పార్టీ ఎమ్మెల్యేల తీరు మరింత కలవరపెట్టేదిగా మారింది. అదునుచూసి వైసీపీ ఎక్కడ వాళ్లను లాగేసుకుంటుందోనన్న భయం కూడా పార్టీలో మొదలైంది.
టీడీపీలో చేరి.. నాశనమయ్యా..:
వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆవేదన చెందారు. సభ్యత్వ నమోదు కోసం రూ.13.50లక్షలు చెల్లించామని, అయినా ఇప్పటికీ తమ చేతికి ఆ కార్డులు అందలేదని వాపోయారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ విష్ణువర్ధన్రెడ్డి అనుచరులు వాటిని దొంగిలించారని ఆరోపించారు.
ఆత్మ సాక్షిగా చెబుతున్నా..
'నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే ఆ పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు, కానీ వాళ్లలా నేను అబద్ధాలు చెప్పలేను. ఆత్మసాక్షిగా చెబుతున్నా.. నేను టీడీపీకి అమ్ముడుపోయాను' అని మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఆర్నెళ్లలో పెనుమార్పులు తప్పవు..:
ఆర్నెళ్లు ఓపికపడితే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని మణిగాంధీ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు, బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు త్వరలో టీడీపీ నుంచి బయటకురాబోతున్నారని మరో బాంబు కూడా పేల్చారాయన. తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా సిద్దమేనని, అంతే తప్ప విష్ణువర్ధన్రెడ్డితో రాజీ పడే సమస్యే లేదని మణిగాంధీ అన్నారు.
టీడీపీలో కలవరం..:
ప్రత్యేక హోదా, ప్యాకేజీల విషయంలో ఇప్పటికే టీడీపీ తీవ్రంగా సతమతమవుతుంటే.. ఇప్పుడు నాయకుల నుంచి ఇలాంటి లీకులు రావడం టీడీపీని కలవరపెట్టేదిగా మారింది. ఇదే అదునుగా అటు వైసీపీ కూడా ఈ నాయకులకు గాలం వేసే అవకాశం కూడా లేకపోలేదు.
ఆర్నెళ్లలో పెనుమార్పులు తప్పవంటూ మణిగాంధీ అంత బలంగా చెబుతున్నారంటే.. వైసీపీ నుంచి ఫిరాయించిన జయరాముడు లాంటి ఎమ్మెల్యేలు తిరిగి పార్టీతో టచ్ లోకి వెళ్తున్నట్టు ఆయనకేమైనా లీకులుఅందాయా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. చూడాలి మరి, మణిగాంధీ చెప్పినట్టు.. రాబోయే రోజుల్లో ఎలాంటి పెనుమార్పులు చోటు చేసుకుంటాయో!