సెంచరీ దాటిన జాబితా, సర్వే చేయిస్తున్న బాబు: 2019లో తెలంగాణ నేతలకు ఢిల్లీలోను పదవులు!
హైదరాబాద్: మహాకూటమిలో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 12 నుంచి 18 సీట్లు వచ్చే అవకాశముంది. పక్కాగా గెలిచే స్థానాలను తెలంగాణ టీడీపీ నేతలు కోరనున్నారు. ఇప్పటికే కొన్ని సీట్లపై అంతర్గతంగా నిర్ణయానికి వచ్చారు. మరిన్ని సీట్లపై రావాల్సి ఉంది. కాంగ్రెస్ 12 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మరో ఆరు సీట్లు అడుగుతానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.
Recommended Video
సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపే, నువ్వు గెలుస్తున్నావ్.. లక్కీ, అదే జగన్ కొంపముంచింది: కేసీఆర్ జాగ్రత్తలు
టిక్కెట్ల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలకు సూచించారు. ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గం ప్రభావం ఎంత, ఎక్కడ మనకు బలం ఉంది, ఏ సామాజిక వర్గం మనకు అనుకూలంగా ఉంది, ఎవరికి టిక్కెట్ ఇస్తే గెలుస్తారు.. ఇలా అన్నింటిని పరిగణలోకి తీసుకొని సీటు కేటాయించాలని నిర్ణయించారు.
సర్వే చేయిస్తున్న చంద్రబాబు!
జిల్లాల వారీగా అన్ని వర్గాల బలాబలాలపై తెలుగుదేశం సర్వే చేయిస్తోంది. ఈ ఫలితాల ఆధారంగా టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించిందని తెలుస్తోంది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన చాలామంది నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో నాటి టీడీపీ పార్టీకి చెందిన, నేడు ప్రత్యర్థి అయినా అభ్యర్థి ఎలా గెలిచారు, ఆయన బలం ఇప్పుడు ఎలా ఉంది, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు మనం టిక్కెట్ ఇచ్చే అభ్యర్థి ఆయనపై గెలుస్తారా, లేదా ఎవరికి టిక్కెట్ ఇస్తే గెలుస్తారు.. అనే అంశాలను చూసుకొని సీటు కేటాయించనున్నారు. పక్కాగా గెలిచే స్థానాలను, పక్కాగా గెలిచే వ్యూహంతో చంద్రబాబు ముందుకు తీసుకు వెళ్తున్నారని తెలుస్తోంది.
టిక్కెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య సెంచరీ దాటింది
ఇటీవల పలువురు నేతలు టీడీపీలో చేరారు. వారు టిక్కెట్లు ఆశిస్తున్నారు. వారికి టిక్కెట్ ఇస్తే గెలుస్తారా అనే కోణంలో సర్వే చేసిన తర్వాతనే కేటాయించనున్నారని తెలుస్తోంది. టిక్కెట్ల పంపకాల్లో భాగంగా టీడీపీ తొలుత ముప్పై సీట్లు అఢిగింది. కానీ 12 నుంచి 15 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. 18 వరకు వస్తాయని తెలంగాణ టీడీపీ భావిస్తోంది. పార్టీలో టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య సెంచరీ దాటింది. కానీ సీట్లు మాత్రం ఇరవైకూడా లేవు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే కీలక పదవులు
అందుకే, చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలకు సోమవారం హితబోధ చేశారు. ఎక్కువ సీట్లు ఆశించవద్దని, కూటమి గెలుపు కోసం పని చేయాలని సూచించారు. తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ ప్రభుత్వంలో చేరుతుంది. టిక్కెట్లు రాని వారికి పదవులతో పాటు కార్పోరేషన్ల చైర్మన్ పదవులు దక్కనున్నాయి.
కేంద్రంలోను తెలంగాణ నేతలకు పదవులు
అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అక్కడా ప్రభుత్వంలో చేరుతుందని అంటున్నారు. అప్పుడు తెలంగాణ నేతలకు మంచి అవకాశముంటుందని భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మూడు సీట్లు గెలిపించుకునే సత్తా ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
టిక్కెట్పై టీడీపులో అప్పుడే అసంతృప్తి
మరోవైపు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సీట్ల కేటాయింపు జరగకముందే అసంతృప్తులు ప్రారంభమయ్యాయి. శేరిలింగంపల్లి టిక్కెట్ భవ్య సిమెంట్స్ అధినేతకు ఖరారయిందనే ప్రచారం జరగడంపై ఆ పార్టీ సీనియర్ నేత మొవ్వ సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవ్య సిమెంట్ ఆనంద్కు టిక్కెట్ ఇవ్వవద్దని మొవ్వ సత్యనారాయణ వర్గీయులు ఆందోళన చేపట్టారు. టీడీపీ కార్యాలయం వద్ద నియోజకవ కార్యకర్తలు నిరసన తెలిపారు.