ఏపీకి పిడుగుల గండం: నేడు, రేపు కోస్తాంధ్ర 'బీ అలర్ట్'!..
విశాఖపట్నం: ఎండాకాలం మొదలైనప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం అనూహ్యంగా మారుతూ వస్తోంది. ఎప్పుడు మబ్బులు కమ్ముకుంటాయో చెప్పలేని పరిస్థితి. దానికి తోడు పిడుగులు వణికిస్తున్నాయి. వేల సంఖ్యలో పడుతున్న పిడుగులతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
గత మంగళవారం ఒక్కరోజే 40వేల పైచిలుకు పిడుగులు పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగుతుందని వాతావరణశాఖ నిపుణులు చెబుుతున్నారు. శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం రాత్రి ఒక నివేదికలో తెలిపింది.
వణికిస్తున్న పిడుగులు: ఒక్కరోజే 40వేల పైచిలుకు, ప్రకృతి పగబట్టిందా?
కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ తేలికపాటి జల్లులు, వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అనంతపురంలో అత్యధికంగా 39డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24గంటల్లో కోడూరులో 15, తిరుమలలో 10, కదిరి,ఓబులదేవర చెరువు, నూజివీడు, నల్లమడ, పాకాలల్లో 7, అవనిగడ్డ, తిరుపతి ప్రాంతాల్లో 6సెం.మీ వర్షపాతం నమోదైంది.