టిక్కెట్: సభ్యత్వం లేకుండా ఒకరికి, 24 గంటల్లో ఒకరికి!
తెరాస ఇప్పటి వరకు ఎనిమిది మంది లోకసభ, 73 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఇందులో ఒక రోజు ముందు గులాబీ కండువా కప్పుకున్న వారికి, తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఇస్తున్నారని కాంగ్రెసు, టిడిపిలు ఆరోపిస్తున్నాయి. ఉద్యమంలో పద్నాలుగేళ్లుగా ఉన్న వారిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శుక్రవారం ప్రకటించిన పార్టీ తొలి జాబితాలోనే వలసవాదులకు పెద్దపీట వేయడంపై పలువురు మండిపోయారు. శనివారం విడుదల చేసిన మలి జాబితాలో ఏకంగా పార్టీ సభ్యత్వం లేనివారికీ టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త వారికి పార్టీ టికెట్లు ఇస్తుండడంతో మొదటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో తెరాసని పట్టుకొని ఉన్న నాయకులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటున్నారు.
శనివారం ఎనిమిది లోకసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, అందులో బి వినోద్ కుమార్ ఒక్కరే తెరాసలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. మిగిలిన వారందరూ ఏడాది, రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన వారేనని విమర్శలు వస్తున్నాయి. సికింద్రాబాద్ లోకసభ అభ్యర్థిగా ఎంపికైన టి భీంసేన్ అసలు పార్టీ సభ్యుడే కాదంటున్నారు. ఆయన ఇప్పటి వరకు అధికారికంగా పార్టీలో చేరనేలేదని, అధినేత కెసిఆర్ను మాత్రం కలిసి వెళ్లారంటున్నారు. ఆయనకు కీలకమైన సికింద్రాబాద్ లోకసభ స్థానాన్ని కట్టబెట్టారంటున్నారు.
సిటింగ్ ఎంపీ మంద జగన్నాథం తొమ్మిది నెలల కిత్రం పార్టీలోకి వచ్చారు. కడియం శ్రీహరి ఆరు నెలల క్రితం తెరాసలో చేరారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏడాది క్రితం, జితేందర్రెడ్డి రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చారు. ఇక, బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 24 గంటలు తిరగకుండానే ఆయనకు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారని పలువురు మండిపడుతున్నారు.