సీఎం జగన్ పై 9 మంది కేంద్ర మంత్రుల ఒత్తిడి - ఒకే ఇష్యూ : సీన్ రివర్స్ -ఇలా తేల్చేసారు...!!
ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ బోర్డు ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి కసరత్తు తుది దశకు చేరుకుంది. ఛైర్మన్ గా సుబ్బారెడ్డి నియామకం పూర్తయిన వెంటనే వారంలోగానే బోర్డు సైతం ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే, బోర్డు సభ్యులుగా అవకాశం కోసం సీఎం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి కనిపిస్తోంది. సహజంగా బోర్డులో ఏపీతో పాటుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సభ్యులకు అవకాశం ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి ఏర్పాటు చేసిన బోర్డులో ఈ రకమైన ఒత్తిళ్ల కారణంగానే 25 మందితో ఏర్పాటు చేయాల్సిన బోర్డును 37 మందితో ఏర్పాటు చేసారు.
సీఎం జగన్ కు 9 మంది కేంద్ర మంత్రుల సిఫార్సు
ఇక, ఇప్పుడు రెండో సారి పెద్ద ఎత్తున సీఎం జగన్ ను ఒప్పించేందుకు అనేక రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు..కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చెన్నైకు చెందిన గూడూరు రాధాక్రిష్ణన్ అనే వ్యక్తికి టీటీడీలో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా తొమ్మది మంది కేంద్ర మంత్రులు సిఫార్సు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. టీటీడీ గతంలో ఇదే వ్యక్తికి చెన్నైలో టీటీడీ దేవాలయాల నిర్వహణా బాధ్యతలు కేటాయించింది. అయితే, ఆ తరువాత ఆయనకు ఆ హోదా రద్దు చేసింది.
ఆ వ్యక్తి పైన తమిళ మీడియా వ్యతిరేక ప్రచారం
ఇక, ఇప్పుడు కేంద్ర మంత్రులు శ్రీపాద నాయక్, జలశక్తి మంత్రి షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, మాజీ కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక కీలక మంత్రి సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం బయటకు రావటంతో..తమిళ మీడియా గూడూరు రాధాక్రిష్ణన్ పైన కధనాలు ప్రచురించింది. ఆయన కొన్ని కీలక వ్యవస్థల్లో బ్రోకర్ గా వ్యవహరిస్తూ ఉంటారని..ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ సభ్యుడి హోదా కు ఎలా సిఫార్సు చేస్తున్నారంటూ ఆ పత్రిక కధనం ప్రచురించింది.
లేఖ వెనక్కు తీసుకున్న ఒక కేంద్ర మంత్రి
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తన సిఫార్సు లేఖను ఉప సంహరించుకున్నారు. మిగిలిన మంత్రులు అదే బాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలుత ఇన్ని సిఫార్సు లేఖలు రావటంతో రాధాక్రిష్ణన్ కు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. కానీ, టీటీడీ సభ్యుడిగా నియమించే సమయంలో వారి ట్రాక్ రికార్డు పైన ప్రభుత్వం ఆరా తీయటం సహజం. ఆ సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాలతో ఇప్పుడు ఆయన నియామక ప్రతిపాదన పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది.
Recommended Video
జగన్ పైన ఒత్తిడి.. తుది కసరత్తు
ఇదే సమయంలో..పలువురు కేంద్ర మంత్రులు ఇస్తున్న సిఫార్సు లేఖలను స్క్రూటినీ చేయటం..ఎవరికి టీటీడీ బోర్డులో అవకాశం ఇవ్వాలనే అంశం పైన ఏపీ సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ వారం లోనే బోర్డు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటంతో...బోర్డు సభ్యుల సంఖ్య ఎంత ఉంటుంది..ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.