ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు భారీవర్షాలు-జంట అల్పపీడనాల ప్రభావం
బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రంలోనూ ఒకేసారి రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షిణాది రాష్ట్రాలపై పడుతోంది. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవబోతున్నాయి.
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తుపాను ప్రభావంతో తీరప్రాంతానికి ఇరువైపులా అల్పపీడన ప్రాంతాలు ఏర్పడ్డాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. తూర్పు మధ్య మరియు ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన మరో అల్పపీడన కర్ణాటక, కేరళ తీరానికి దగ్గరగా ఉంటుంది. రుతుపవనాలు వెనుదిరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 5-6 రోజులు ఇదే పరిస్ధితి కొనసాగబోతోంది.
బంగాళాఖాతం మీదుగా ఏర్పడే అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తీరాన్ని దాటబోతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలాగే వచ్చే 48 గంటల్లో, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణాలో రెయిన్ బెల్ట్ విస్తరించి ఉంటుందని వివరించింది. అదే సమయంలో, తీరప్రాంత కర్ణాటక, కేరళ సమీపంలో ఏర్పడే అల్పపీడనం వచ్చే 3 రోజులు ప్రభావం చూపబోతోంది.
కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో 16-18 అక్టోబర్ మధ్య అల్పపీడన ప్రభావం పెరుగుతుంది. తూర్పు గాలుల వేగం, లోతు పెరుగుదల ఫలితంగా ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం ఉత్తర భారతదేశానికి విస్తరిస్తుంది. అక్టోబర్ 17, 18 తేదీలలో ఉత్తరాఖండ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో స్థానికంగా వరదలు, కొండచరియలు విరిగి పడటం, బలమైన మెరుపు దాడులు జరిగే అవకాశం ఉంది. మరో అల్పపీడనం అక్టోబర్ 17 న బంగాళాఖాతంలోకి ప్రవేశించడానికి వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనాల కంటే ఎక్కువ ప్రభావ వంతంగా ఉండొచ్చని తెలుస్తోంది.