జంపింగ్పై వాగ్యుద్ధం, కౌంటర్: టిడిపికి జగన్ నేర్పారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టిడిపిలో చేరడం, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టిడిపికి అనుబంధంగా కొనసాగుతానని చెప్పడం.. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్, టిడిపిల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. పలువురు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరుతారని టిడిపి నేతలు చెబుతున్నారు. తమ పార్టీ వారిని టిడిపి చేర్చుకోవడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖండిస్తుండగా... నైతిక విలువలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయా అంటూ టిడిపి కౌంటర్ ఇస్తోంది.
ఎస్పీవై రెడ్డి ఆదివారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. బుట్టా రేణుక టిడిపికి అనుబంధంగా కొనసాగుతానని చెప్పారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మైసూరా రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ గుర్తు పైన గెలిచిన ప్రజాప్రతినిధులను టిడిపి చేర్చుకోవడంపై సమాధానం చెప్పాలని నిలదీశారు. వారు పార్టీ మారితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని చెప్పారు. తమ పార్టీ వారిని టిడిపి చేర్చుకొని నైతిక విలువలు వదిలేసిందని మండిపడ్డారు.
దీనికి టిడిపి కూడా ధీటుగానే స్పందిస్తోంది. నైతిక విలువలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయా అని టిడిపి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, సిఎం రమేష్ వంటి వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇతర పార్టీలకు చెందిన వారిని వైయస్ జగన్ చేర్చుకున్నప్పటి మాటేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీకి నైతిక విలువలు గుర్తుకు వస్తున్నాయా అని ప్రశ్నిస్తున్నారు.
కాగా, జగన్ పార్టీ ఎంపీ ఆదివారం టిడిపిలో చేరడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమ పార్టీ వారు మారితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతుండగా, జగన్ పార్టీ కేవలం రిజిస్టర్డ్ పార్టీయే తప్ప రికగ్నైజ్డ్ పార్టీ కాదని, అందువల్ల ఫిరాయింపుల చట్టం వర్తించదని యనమల చెబుతున్నారు. గతంలో ఇతర పార్టీలకు చెందిన వారిని చేర్చుకొన్న జగన్.. ఆ విద్యను తమకు నేర్పారని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
మీరే నేర్పారంటూ....
వైయస్ జగన్ పార్టీ స్థాపించిన తర్వాత పలువురు కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు. 2013 జూన్ 7వ తేదీన కాంగ్రెస్, టిడిపికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై సభాపతి నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేశారు. ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడలేదు. నాడు కాంగ్రెస్, టిడిపికి చెందిన ప్రజా ప్రతినిధులు వారి సభ్యత్వాలను వీడకుండా పార్టీలో చేరితే సాదరంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్... ఇప్పుడు దానిని వెన్నుపోటుగా ఎలా ప్రశ్నిస్తారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.