వచ్చే ప్రభుత్వంలో మేం కీలకం, ఎవరు ఆంబోతులో తెలుసు: టీడీపీపై రామ్ మాధవ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ప్రభుత్వం మారుతోందని బీజేపీ నేత రామ్ మాధవ్ సోమవారం అన్నారు. వచ్చే ప్రభుత్వంలో బీజేపీ కీలక పాత్ర పోషించబోతోందని చెప్పారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంటే, ఏపీ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. కేంద్రంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై తీవ్రంగా నిప్పులు చెరిగిన జీవీఎల్ నర్సింహా రావు
అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా బీజేపీ ఐదు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారంతా ఆంధ్రప్రదేశ్ ద్రోహులు అని ముద్ర వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో హిట్లర్ పాలన సాగుతోందని చెప్పారు. అగ్రిగోల్డ్ వల్ల లక్షలాది కుటుంబాలు మోసపోయాయని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని చెప్పారు. టీడీపీ అంటే తెలుగు దోపిడీ పార్టీగా మారిందన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని రామ్ మాధవ్ చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని చెప్పారు. కొనడానికి వచ్చిన వారిని భయపెడుతున్నారని ఆరోపించారు. తమది సింహాల పార్టీ అని, ఆంబోతుల పార్టీ ఎవరిదో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ప్రశ్నించిన వారిని ఆంబోతులుగా ముద్రవేస్తున్నారన్నారు.
తమకు అభివృద్ధి అవసరం లేదని, ప్రత్యేక హోదా చాలు అని ఏపీ ప్రభుత్వం చెబుతోందని రామ్ మాధవ్ అన్నారు. పలువురు అగ్రిగోల్డ్ బాధితులు ఢిల్లీకి వచ్చి తమను కలిశారని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలో కీలక పాత్ర పోషిస్తామని, అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని, రూ.6500 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. చీటికి మాటికి కేంద్రంపై నిందలు వేస్తున్నారని చెప్పారు. హోదా ఇవ్వకపోయినా కేంద్రం అంతకుమించి సాయం చేస్తోందని, తమకు ఏపీ అభివృద్ధి కాకుండా హోదా కావాలని వారు అడుగుతున్నట్లుగా ఉందన్నారు.