బాబునే టార్గెట్ చేయడం వెనుక..?: మోడీపై శివాజీకి భిన్నంగా జగన్!
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఆరు రోజులకు పైగా దీక్ష చేశారు. కొద్ది నెలల క్రితం నటుడు శివాజీ కూడా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేశారు.
ఈ నేపథ్యంలో పలువురు ఈ రెండు దీక్షలకు పోలిక తెస్తున్నారు. అయితే, ఇరువురు నేతలు వేర్వేరు పద్ధతుల్లో తమ దీక్షను చేశారు. కానీ, వీరిద్దరు దీక్షలకు పలువురు పోలిక తెస్తున్నారు. ఇందులో ప్రధానంగా... బిజెపిని కాకుండా కేవలం టిడిపినే ప్రశ్నించడాన్ని గుర్తు చేస్తున్నారు.
శివాజీ ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేయడంతో పాటు పలుమార్లు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన టిడిపి, బిజెపిలను దుయ్యబట్టారు. కొన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీ పైన కూడా నిప్పులు చెరిగారు. బిజెపికి హెచ్చరికలు జారీ చేశారు.
వెంకయ్య నాయుడు పైన నిప్పులు చెరిగారు. నాడు విభజన సమయంలో బిజెపి ప్రత్యేక హోదా కోసం పోరాడిందని, కానీ అధికారంలోకి వచ్చాక దానిని పక్కన పెట్టిందని, ఇలాగే ఉంటే... బిజెపికి బుద్ధి చెప్పడం ఖాయమని శివాజీ పలు సందర్భాల్లో మండిపడ్డారు. చంద్రబాబు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో జగన్ కేవలం చంద్రబాబునే తప్పుపడుతున్నారని, కేంద్రాన్ని ప్రధాని మోడీని ఎందుకు నిలదీయడం లేదని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
జగన్ దీక్షకు ముందు, దీక్షా సమయంలో కూడా ప్రధానంగా చంద్రబాబును, టిడిపినే టార్గెట్ చేశారని చెబుతున్నారు. కానీ కేంద్రాన్ని మాత్రం మాటమాత్రంగా అనడమే తప్పితే గట్టిగా నిలదీయడం లేదంటున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలో ఉన్నందున.. ఆయన ఢిల్లీలో దీక్ష చేయాలంటున్నారు.
శివాజీ కూడా ఏపీలో ఆందోళనలు చేసినప్పటికీ టిడిపితో పాటు బిజెపి పైన నిప్పులు చెరిగారు. కానీ జగన్ అలా కాదని గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా పైన బిజెపి హామీ ఇచ్చిందని అలాంటప్పుడు ఆ పార్టీ పైనే ఒత్తిడి తేవాలంటున్నారు.
కానీ జగన్ మాత్రం చంద్రబాబు పైనే ఒత్తిడి తేవడం వెనుక వ్యూహం దాగి ఉందని టిడిపి అనుమానిస్తోంది. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపి తప్పించడం ద్వారా చంద్రబాబును బిజెపికి దూరం చేయాలని చూస్తున్నారని, ఆ తర్వాత ఆయన బిజెపికి దగ్గరవుదామనుకుంటున్నారని టిడిపి అనుమానిస్తోంది.
ఏపీకి కేంద్రం నుంచి సహకారం అవసరమని, అందుకే చంద్రబాబు కేంద్రంతో ఘర్షణ వాతావరణం కొని తెచ్చుకోవడం లేదని, అలాంటి పరిస్థితి ఎదురైతే కేంద్రం నుంచి సహకారం తగ్గిపోతుందని ఆయన భావిస్తున్నారని, కాబట్టి ప్రత్యేక హోదా కొంత మౌనంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
హోదా కంటే కేంద్రం నుంచి వివిధ పద్ధతుల్లో సహకారం మంచిదని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే, హోదా అంశాన్ని తాము వదిలి పెట్టడం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. సహకారం, ప్యాకేజీని తీసుకుంటూనే ప్రత్యేక హోదాను సాధిస్తామని చెబుతున్నారు. అయితే, ఇక్కడ ప్రధానంగా శివాజీ రెండు పార్టీలను చీల్చి చెండాడగా, జగన్ మాత్రం టిడిపి పైనే ఎక్కువ దృష్టి పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.