పరిశ్రమలు తెరుస్తారు సరే.. కార్మికుల సంగతేంటి ? రాకపోకలు సాధ్యమేనా ?
ఏ ఆర్ధిక వ్యవస్ధకైనా పారిశ్రామిక ప్రగతి అత్యవసరం. మారుతున్న కాలమాన పరిస్ధితుల్లో పరిశ్రమలు లేని వృద్ధిని ఊహించలేం. కానీ కరోా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధి కుంటుపడిపోయింది. కేవలం అత్యవసర వస్తువుల తయారీ తప్ప మిగతా పరిశ్రమలేవీ పనిచేయడం లేదు. దీంతో ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ పరిమితులను సడలించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికే కార్మికులు స్వస్దలాలకు వెళ్లిపోవడంతో స్ధానికంగా ఉన్న కొందరినే నమ్ముకుని పరిశ్రమలు నడిపించాల్సిన పరిస్ధితి.
లాక్ డౌన్ సడలించినా పరిశ్రమలు నడిచేదెలా ?
ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా అత్యవసర వస్తువులను, మందులను ఉత్పత్తి చేసే కొన్ని పరిశ్రమలు మాత్రమే అరకొర సిబ్బందితో పనిచేస్తున్నాయి. మొత్తం సిబ్బందితో పనిచేస్తేనే లాభాలు ఉంటాయో లేదో తెలియని కాలంలో కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమలు మూతపడటం, అరకొరగా పనిచేయడం పారిశ్రామిక ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. కార్మికులు నేరుగా పనిచేస్తే కానీ ఉత్పత్తులు బయటికి రాని ఎన్నో పరిశ్రమలు ఇప్పుడు మూలనపడ్డాయి. ఇవన్నీ తెరుచుకోవాలంటే కార్మికులు తిరిగివిధుల్లోకి రావాల్సిందే.
ప్రస్తుతం అది సాధ్యమేనా ?
కరోనా వైరస్ భయాలతో సిబ్బందికి సెలవులిచ్చేసి పరిశ్రమలను మూసేసిన వాటి యజమానులు.. కార్మికుల గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో రోజులు గడవక స్వస్ధలాలకు వెళ్లిపోయారు. వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారంతా పూట గడవని పరిస్ధితుల్లో ఏదో రకంగా అష్టకష్టాలు పడి స్వస్ధలాలకు చేరుకున్నారు. తిరిగి వీరంతా విధుల్లోకి రావాలంటే చాలా కష్టం. ఒకవేళ పరిస్దితులు అనుకూలించినా వీరంతా తిరిగి పరిశ్రమల్లో పనిచేసేందుకు వస్తారో రారో తెలియని పరిస్దితి. దీంతో పరిశ్రమలకు తీవ్ర సిబ్బంది కొరత తప్పేలా లేదు.
స్ధానికంగా ఉండే వారికీ...
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో పనిచేస్తున్న వారు పరిశ్రమలు తెరిచినా తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్ధితుల్లో స్ధానికంగా ఉండే వారే ఇప్పుడు ఆశాదీపంగా కనిపిస్తున్నారు. అయితే వీరిని కూడా పూర్తిస్ధాయిలో పరిశ్రమలకు రప్పించలేని పరిస్దితి. లాక్ డౌన్ నిబంధనల్లో మార్పులు చేసిన తర్వాత కూడా రోడ్లపై ఆంక్షల కారణంగా వారు రాలేకపోతే అప్పుడు కూడా పరిశ్రమలకు ఇబ్బందులు తప్పవు. దీంతో ప్రభుత్వమే ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోని రీతిలో పారిశ్రామిక రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ.. పరిశ్రమలు తెరిచేందుకు అనుమతిస్తే సరిపోదని, కార్మికులకు సైతం లాక్ డౌన్ ఇబ్బందులు లేకుండా పని చేసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది.
Recommended Video