బీజేపీలోకి సుజనా చౌదరి వెళ్తారని ప్రచారం, తిరుపతి సభలో ఇలా..: అసలేం జరిగింది!?
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. అయితే అదంతా వట్టి ప్రచారమేనని తేలిపోయిందని అంటున్నారు. ఎందుకంటే తిరుపతిలో టీడీపీ ధర్మ పోరాట దీక్షలో ఆయన పాల్గొని బీజేపీపై నిప్పులు చెరిగారు. అసలు సుజనా చౌదరి టీడీపీని వీడుతారనేది నమ్మశక్యం కాని విషయం అంటున్నారు.
ఎందుకంటే చంద్రబాబుతో ఆయనకు అలాంటి అనుబంధం ఉంది. అలాంటిది ఇటీవల ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ధర్మపోరాట దీక్షలో సుజన మాట్లాడుతూ.. ఏపీకి కేంద్రం నమ్మకద్రోహం చేసిందని, ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు అన్న రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. హామీలపై నాలుగేళ్లుగా కేంద్రం కాలాయపన చేయడంతో కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయకత్వంలో పోరాడుతున్నామన్నారు.
కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు: నిమ్మకూరులో జగన్ ప్రకటన, కొనకళ్లపై బసవతాకరకం బంధువుల ఫిర్యాదు
సుజన టీడీపీకి కీలక నేత, బీజేపీతో టచ్లో అంటూ
సుజన పార్టీ మారుతారంటూ ఇటీవల ప్రచారం సాగింది. సుజన బీజేపీలో చేరుతారని టీడీపీ నేతలు కొందరు భావిస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. టీడీపీలో సుజన కీలక నేత. అలాంటి నేతపై ప్రచారం సాగింది. ఆయన బీజేపీ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. టీడీపీకి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్లో మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారని అంటున్నారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు
చంద్రబాబుకు సుజన అత్యంత సన్నిహితులు. ఆయనను కాదని ఏ పనీ చేయరని అంటారు. అలాంటి వ్యక్తి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారాన్ని దాదాపు ఎవరూ నమ్మలేదు. సుజన ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆయన వల్ల బీజేపీకి ఒరిగేదేమీ ఉండదని అంటున్నారు. అలాంటప్పుడు ఆయన ఎందుకు చేరుతారని, బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందనే వాదనలు కూడా వినిపించాయి.
లోకేష్ స్పందించారంటూ
కాగా, టీడీపీ వాట్సాప్ గ్రూప్లో దీనిపై ప్రచారం జరిగితే లోకేష్ స్పందించారట. ఈ విషయమై ఎలాంటి సమాచారం లేదని, వాస్తవం వెలుగు చూసే వరకు వేచి చూద్దామని లోకేష్ చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో కథనం కూడా వచ్చింది. లోకేష్ స్పందన అటు నిర్ధారించడం లేదు ఇటు ఖండించడం కానీ కాకుండా తటస్థంగా ఉండటంతో సుజన బీజేపీలోకి ఫిరాయించే విషయమై గ్రూప్లో మరింత చర్చకు దారి తీసిందని అందులో పేర్కొన్నారు. సుజన దారిలోనే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ వీడే అవకాశముందని కూడా ఒకరి చెప్పినట్లుగా పేర్కొన్నారు.
సుజనా చౌదరి కీలక నేత
2014 ఎన్నికల్లో టీడీపీకి విరాళాల సేకరణ, ఇతర పార్టీల నేతల చేరికల విషయంలో సుజన కీలకంగా వ్యవహరించారన,ి టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆయన పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. కేబినెట్ మంత్రుల ఖరారు నుంచి కీలక ప్రాజెక్టుల అప్పగింత వరకు ఆయన కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
కీలక నేతలతో విభేదాలు అంటూ
అంతేకాదు, పార్టీలోని కీలక నేతలతో ఆయనకు సంబంధాలు బెడిసికొట్టాయని కూడా ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబుకు, సుజనకు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని, అంతా వట్టి ప్రచారమేనని అంటున్నారు. అంతేకాదు, సోమవారం తిరుపతి సభలో ఆయన మాట తీరు కూడా ఎలాంటి అసంతృప్తి కనిపించలేదని అంటున్నారు. కాబట్టి ఉద్దేశ్యపూర్వకంగా కొందరు ప్రచారం చేస్తున్నారేమో అంటున్నారు.
రామ్మోహన్ నాయుడు, జయదేవ్కు ప్రాధాన్యం
ఇటీవల తెలుగుదేశం పార్టీ గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ నాయుడు వంటి యువ నేతలకు మంచి ప్రాధాన్యత ఇస్తోంది. కానీ పార్టీలో ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుందనేది కొందరి వాదన. కానీ మొత్తానికి సుజనా చౌదరిపై వట్టి ప్రచారమే జరిగిందని నిన్నటి తిరుపతి సభతో తేలిపోయిందని అంటున్నారు.