రామానాయుడు మృతి: తల్లడిల్లిన చిరు సహా నేతలు, సినీ ప్రముఖులు
హైదరాబాద్: మూవీ మొఘల్ రామానాయుడు మృతి పైన టాలీవుడ్ తల్లడిల్లింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రామానాయుడు మృతి పైన స్పందించారు.
తనకు రామానాయుడితో యాభై సంవత్సరాల అనుబంధముందని తెలిపారు. 1996-99 మధ్య తాను బాపట్ల ఎంపీగా పని చేశానని, ఆ తర్వాత అదే స్థానం నుండి రామానాయుడు పోటీ చేసి గెలుపొందారని చెప్పారు. ఇద్దరం 1999-2004 మధ్య ఒకేసారి ఎంపీగా ఉన్నామని చెప్పారు.
ప్రజా సమస్యల పైన నిత్యం చర్చించే వాళ్లమన్నారు. సన్నిహిత వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందన్నారు. మంచి మానవతా దృక్పథం ఉన్న వ్యక్తిని సమాజం, టాలీవుడ్ కోల్పోయిందన్నారు.
రామానాయుడు మృతదేహానికి నివాళులు అర్పించేందుకు చిరంజీని, రాజశేఖర్, అశోక్ కుమార్, సుబ్బిరామి రెడ్డి, అల్లు అర్జున్, నాగచైతన్య తదితరులు వచ్చారు.
విప్లవ సినిమాలకు పేరుగాంచిన ఆర్ నారాయణ మూర్తి వచ్చి నివాళులు అర్పించారు. ఆయన మనసున్న వ్యక్తి అన్నారు. అనేకమంది నిర్మాతలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈ వయస్సులో ఆయన చనిపోవడం బాధే అయినప్పటికీ, పరిపూర్ణ జీవితం అనుభవించారన్నారు. రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయన స్వగ్రామం కారంచేడులో విషాదఛాయలు అలుముకున్నాయి. అభిమానులు కారంచేడు నుండి హైదరాబాద్ బయలుదేరారు.
దురదృష్టకరం : మురళీమోహన్
రామానాయుడు మృతి దురదృష్టకరమని మా అధ్యక్షుడు మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో అలాంటి నిర్మాత లేరన్నారు. అన్ని భాషల్లోనూ చిత్రాలను తీయడంతో పాటు గిన్నీస్రికార్డులో స్థానం కల్పించుకున్నారని కొనియాడారు.
48 ఏళ్ల అనుబంధం: కృష్ణ
సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్న రామానాయుడు మృతి చెందడం చాలా బాధాకరమని ప్రముఖ నిర్మాత విజయనిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ర్టీలో తన స్వతంత్రంగా ఉన్న వ్యక్తి రామానాయుడు అన్నారు. ఈ రెండు ఏళ్లలో అనేక మంది గొప్ప వ్యక్తులను ఇండస్ర్టీ పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరమన్నారు.
రామానాయుడితో తనకు 48 ఏళ్ల అనుబంధం ఉందని నటుడు కృష్ణ తెలిపారు. ఆయన నిర్మాతగా మల్లీస్టారర్ సినిమాల్లో నటించానన్నారు. తనతో ఎంతో చనువుగా ఉండేవారని కృష్ణ గుర్తుచేసుకున్నారు. రామానాయుడు మృతి పట్ల ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సినీపరిశ్రమకు తీరని లోటు: టిఎస్సార్
రామానాయుడు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని టి సుబ్బిరామి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 సంవత్సరాలుగా రామానాయుడితో అనుబంధం ఉందని, అత్యంత ప్రియమిత్రుడని ఆయన తెలిపారు. దాదాపు 150 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం సామాన్య విషయం కాదన్నారు.