కారణం లేకుండా జగన్ దీక్ష: 'ఆ సమయం'పై తెలుగుదేశం ఎద్దేవా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మహన్ రెడ్డి రైతు దీక్ష పైన టిడిపి నేతలు, మంత్రులు సోమవారం నిప్పులు చెరిగారు.
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మహన్ రెడ్డి రైతు దీక్ష పైన టిడిపి నేతలు, మంత్రులు సోమవారం నిప్పులు చెరిగారు. జగన్ కారణం లేకుండా దీక్ష చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
కేవలం హింసను ప్రేరేపించేందుకే జగన్ దీక్ష చేపట్టారన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. మన రాష్ట్రం పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.
జగన్ తన ఉనికి కాపాడుకొనేందుకే గుంటూరులో రైతు దీక్ష చేపట్టారని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఏ రాష్ట్రం చేయని విధంగా..
రైతుకు గరిష్ఠంగా రూ.1.5లక్షల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని పత్తిపాటి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా రూ.24వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు.

అసలు జగన్కు తెలుసా
అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామన్నారు. జగన్కు అసలు వ్యవసాయం గురించి తెలుసా? అని ప్రశ్నించారు. రుణమాఫీని వ్యతిరేకించి ఆరోపణలు చేస్తే రైతులు నమ్మరన్నారు.

కేంద్రంపై ఒత్తిడి
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. తాను అధికారంలోకి వస్తానని జగన్ కలలు కంటున్నారని టిడిపి నేతలు ఎద్దేవా చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఆ సమయం ఎంతో దూరం లేదన్న జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ఆ సమయం దూరంలో లేదని జగన్
కాగా, అంతకుముందు రైతు దీక్ష ప్రారంభం సమయంలో, మే డే వేడుకల సందర్భంగా జగన్ మాట్లాడారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎంతో దూరంలో లేదని, మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని కార్మికులకు భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications