పులివెందులకు వివేకా కుటుంబీకులు - అటు హైకోర్టులో : ఏం చెప్పబోతున్నారు..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇది రాజకీయంగానూ కీలకంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చేస్తున్న విచారణ...కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్లలో అనేక అంశాలు వెలుగు లోకి వచ్చాయి. వివేకాతో సంబంధాలు ఉన్న అనేక మంది నుంచి సీబీఐ వాంగ్మూలాలు సేకరించింది. వాటిని కోర్టులో సమర్పించింది. అయితే, వివేకా హత్య కేసు జరిగి నేటికి మూడేళ్లు. దీంతో..వివేకా మూడో వర్ధంతిని కడప జిల్లా పులివెందులలో ఆయన కుటుంబీకులు మంగళవారం నిర్వహించనున్నారు. వివేకా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళి అర్పించనున్నారు.
వివేకా హత్య కేసుకు మూడేళ్లు
ఈ మేరకు వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్రెడ్డి సోమవారం పులివెందులకు చేరుకున్నారు. ఈ కేసులో తొలి నుంచి వివేకా కుమార్తె సునీత కేంద్ర హోం శాఖ అధికారులను కలవటం.. న్యాయస్థానాలకు వెళ్లి విచారణ కోరారు. అయితే, సీబీఐ విచారణ సమయంలో బయటకు వస్తున్న విషయాలతో ... కొందరు వైసీపీ నేతలు పరోక్షంగా ఎదురు దాడి చేస్తున్నారు.
ఒక విధంగా సునీతకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆఫర్ చేసారని.. చంద్రబాబు చేతిలో పావులుగా మారుతున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఈ సమయం లోనే హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, ఆయన అనుచరులు సాక్షులను తీవ్రంగా బెదిరిస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
హైకోర్టులో విచారణ..
వివేకా హత్యలో రాజకీయ పెద్దల హస్తం ఉందని, నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని అప్రూవర్గా మారిన దస్తగిరి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. గంగిరెడ్డి బయటుంటే దర్యాప్తునకు విఘాతం కలుగుతోందని, బెయిలు రద్దు చేయాలని కోరారు. దీని పైన స్పందించిన న్యాయమూర్తి గంగిరెడ్డి బెయిల్..పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు.
గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సీబీఐది ఆందోళన మాత్రమేనన్నారు. మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడిన ఇన్స్పెక్టర్ శంకరయ్య, గంగాధర్రెడ్డి, కృష్ణారెడ్డిలు తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంటే గంగిరెడ్డికి ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.
సభలో చర్చిస్తారా..
ఇక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు..వైసీపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సభలో వివేకా హత్య కేసు..తదనంతర పరిణామాల పైన చర్చించటానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ పైన వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. దీంతో..ఈ నెల 25వ తేదీ వరకు జరిగే సమావేశాల్లో దీని పైన చర్చ జరుగుతుందా లేదా అనే ఆసక్తి మొదలైంది. చర్చ జరిగితే సభా వేదికగా వైసీపీ.. ప్రభుత్వం నుంచి ఏం చెప్పబోతున్నారనేది మరో ఆసక్తి కర అంశంగా మారుతోంది.