ఎమ్మెల్సీ ఎన్నిక: చక్రం తిప్పిన బాబు, లాస్ట్ మినట్లో వైసీపీ ఔట్! జగన్ వెనుకడుగు వెనుక కారణాలెన్నో
కర్నూలు/అమరావతి: శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి. టీడీపీ నుంచి, వైసీపీ నుంచి రేసులో వీరే అంటూ ప్రచారం సాగింది. ఆయా పార్టీ నుంచి రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.
Recommended Video
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్కు మంగళవారం తుది గడువు. కానీ సోమవారం సాయంత్రం వరకు టిడిపి, వైసీపీలు తేల్చలేదు. వైసీపీ కోసం టీడీపీ, టీడీపీ అభ్యర్థి కోసం వైసీపీ వేచి చూసే ధోరణి కనిపించింది. అయితే టీడీపీ నుంచి శివానంద రెడ్డి పేరు తెరపైకి రావడంతో వైసీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
చివరి నిమిషంలో తప్పుకున్న వైసీపీ
కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ చివరి నిమిషంలో తప్పుకుంది. వైసీపీ నుంచి గౌరు వెంకట రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలతో పాటు నాగిరెడ్డి, రవికిశోర్ రెడ్డి పేర్లు వినిపించాయి. కానీ టీడీపీ నుంచి శివానంద రెడ్డి పేరు రావడంతో వైసీపీ బరి నుంచి తప్పుకుందని చెబుతున్నారు. అందుకు వైసీపీ నేతతో ఆయనకు బంధుత్వమే కారణమని అంటున్నారు.
టీడీపీ భేటీలో బుట్టా రేణుక: ఎమ్మెల్సీ సీటు పెద్ద సవాలే, చంద్రబాబుకు 'వైసీపీ' ఫీవర్
టీడీపీ రేసులో ఎందరో, శివానంద రెడ్డి నిలబడితే మాత్రం
టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్, శివానంద రెడ్డి, చల్లా శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరుల పేర్లు వినిపించాయి. ఎవరు బరిలో నిలిచినా తాము నిలబడాలని వైసీపీ భావించింది. ఒక్క శివానంద రెడ్డి నిలబడితే మాత్రం తప్పుకోవాలని మొదటి నుంచి భావించినట్లుగా చెబుతున్నారు.
రాజ్భవన్లో కేసీఆర్-పవన్ కళ్యాణ్ ఏకాంత చర్చ: బాబుతో ఆత్మీయంగా, సీఎంలతో చిరంజీవి ఇలా (ఫోటోలు)
అంతకుముందు వ్యూహాలు
సోమవారం సాయంత్రానికి ముందు టీడీపీ, వైసీపీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగాయి. టీడీపీ అభ్యర్థి ఖరారు చేసే వరకు తాము చేయవద్దని వైసీపీ, వైసీపీ తేల్చే వరకు నాన్చాలని టీడీపీ భావించింది. వైసీపీ వ్యూహాలను గమనించిన టీడీపీ శివానంద రెడ్డిని తెరపైకి తీసుకు వచ్చిందని, ఆయన పేరు దాదాపు ఖరారయిందని, దీంతో వైసీపీ విరమించుకుందని చెబుతున్నారు. శివానంద రెడ్డితో వైసీపీని పోటీ నుంచి విరమించుకునేలా చంద్రబాబు వ్యూహం రచించారని అంటున్నారు.
వైసీపీ తప్పుకోవడం వెనుక మరో కారణం
ఎమ్మెల్సీ బరి నుంచి వైసీపీ తప్పుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవలే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. మరో ఏడాది తర్వాత సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ నాయకుడికి ఆర్థికంగా ఇబ్బందులు వద్దనే తప్పుకున్నారని అంటున్నారు.
గౌరు వద్దంటే శిల్పా అనుకున్నారు
శివానంద రెడ్డి కాకుండా మరొకరిని నిలబెడితే మాత్రం పట్టు నిలబెట్టుకునేందుకైనా వైసీపీ పోటీ చేసి ఉండేదని అంటున్నారు. అప్పుడు గౌరును పోటీలో నిలిపేవారని, ఆయన కాదంటే శిల్పా చక్రపాణిని ఒప్పించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. శివానంద రెడ్డి వైపు టిడిపి మొగ్గుచూపడం, ఆర్థిక పరమైన అంశాల కారణంగా వైసీపీ చివరి నిమిషంలో అనూహ్యంగా తప్పుకుంది. టీడీపీకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు.
పోటీ నుంచి తప్పుకోవడంపై వైసీపీ నేత
పోటీ నుంచి తప్పుకోవడంపై వైసీపీ నేత రామయ్య స్పందించారు. తమకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎక్కువగా ఉన్నారని, అయినప్పటికీ తాము పోటీ చేయడం లేదని చెప్పారు. మరోసారి టీడీపీ తమ పార్టీ నేతలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయకుండా ఉండేందుకు పోటీ చేయడం లేదన్నారు.