తెనాలి నుంచి హరిద్వార్ లోని బాబా రాందేవ్ ఆశ్రమానికి వెళ్లిన ఆవు
చిన్న సైజుతో దూడల్లా అందంగా ఉండే పుంగనూరు ఆవులు ఆకర్షణీయంగా ఉండి అందరి చూపులను కట్టిపడేస్తాయి. వీటిని పెంచుకోవడానికి పెద్దగా ఖర్చు అవదు. అలాగే వీటి పాల దిగుబడి కూడా తక్కువగానే ఉంటుంది. ఒకప్పుడు పుంగనూరు ప్రాంతంలో ఈ రకం ఆవులు ఎక్కువగా కనిపించేవి. క్రమేణా అంతరించిపోయే దశకు చేరుకోవడంతో చాలామంది రైతులు వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేసుకొని సంరక్షిస్తున్నారు. కేవలం వీటి జాతిని కాపాడడానికే కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాలతోపాటు తెలంగాణలో మరికొందరు రైతులు ముందుకు వస్తున్నారు. సాధారణ ఆవుకన్నా తక్కువగా పుంగనూరు ఆవు రోజుకు 2 లేక 3 లీటర్ల పాలే ఇస్తుందికానీ వాటిలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. సాధారణ ఆవుల పాలల్లో వెన్న శాతం మూడు నుంచి నాలుగు వరకే ఉంటుంది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రైతు కంచర్ల శివకుమార్ వివిధ జాతులకు చెందిన ఆవులను సంరక్షిస్తున్నారు. అతనివద్ద పుంగనూరు ఆవు ఉందని తెలియడంతో హరిద్వార్ లోని బాబా రాందేవ్ ఆశ్రమం నుంచి ప్రతినిధులు తెనాలి వచ్చి ఆ ఆవును పరిశీలించారు. వారికి బాగా నచ్చడంతో రూ.4.10 లక్షలు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. పుంగనూరు జాతి ఆవులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చని తెనాలి పశువైద్యాధికారి నాగిరెడ్డి తెలిపారు. ఏదేమైనప్పటికీ పుంగనూరు ఆవుకు అంత డిమాండ్ పలకడంతో రైతులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఈ జాతికి చెందిన ఆవు పాలలో అధిక కొవ్వు పదార్థాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చిత్తూరు జిల్లాలోని దక్కను పీఠభూమి దక్షిణ బిందువు ప్రాంతంలో ఉన్న పుంగనూరు పేరును ఈ ఆవుకు పెట్టారు. ఇవి పుంగనూరులోనే ఉద్భవించాయి. పుంగనూరుకు చెందిన జమీందార్లు మైసూర్ సంస్థానంలో దివాన్లుగా ఉండేవారు. వారే ఈ జాతి ఆవులను ఇష్టపడి వాటిని మెరుగుపరిచారు. కొత్తలో పలమనేరు, పీలేరు, చంద్రగిరి, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఉండేవి. ప్రస్తుతం తిరుపతి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని పలమనేరులో పశువుల పరిశోధనా కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో పుంగనూరు జాతి ఆవులను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications