మోడీపై వీహెచ్ విసుర్లు.. వేధించడమే పనా..? వాజ్పేయి, అద్వానీ ఇలా చేయలేదు: వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఫిర్యాదుల పరంపర పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రధాని మోడీపై పడ్డారు. ప్రతిపక్ష నేతలపై మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ పై మోడీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఆర్జేడీ మద్దతు కోరిన బీజేపీ.. అందుకు లాలూ సమ్మతించకపోవడంతో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు.
బీజేపీతో కలవనందుకే లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష వేశారన్నారు. ఇదీ ముమ్మాటికీ కక్షసాధింపు చర్య అని స్పస్టంచేశారు. అయినా లాలూ బెదరలేదని గుర్తుచేశారు. జైలుకైనా పోత..కానీ దేశాన్ని చీల్చాలని కుట్ర చేస్తున్న బీజేపీతో కలవనని చెప్పారు. బీజేపీతో అనుబందంగా ఉన్న నీరవ్ మోడీ, లలిత్ మోడీ ప్రజా ధనాన్ని లూటీ చేసుకుని విదేశాల్లో జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు.
రెంట్ కట్టలేదని సోనియా గాంధీ, ఆమె కుటుంబాన్ని.. అధికారిక నివాసం నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆ విషయాన్ని పేపర్లలో రాయించి.. నానా హంగామా చేశారని వీహెచ్ ఆరోపించారు. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలిలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేయడం లేదని వీహెచ్ అన్నారు. గతంలో అద్వానీ, వాజ్ పేయి ఉన్న సమయంలో బీజేపీలో ఇలా లేదన్నారు.
మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నాయకులను వేధించడం మోడీకి అలవాటుగా మారిందని విమర్శించారు. యూపీఏ హయాంలో అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపించామని గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మాత్రం సొంత పార్టీలో అవినీతికి పాల్పడుతున్న వారిని కాపాడుతోందని విమర్శించారు. జరిగే ప్రతీ విషయాన్ని అందరూ చూస్తున్నారని తెలిపారు. తగిన సమయంలో బుద్ది చెప్పడం ఖాయం అని స్పస్టంచేశారు. జనాలను తక్కువ అంచనా వేయొద్దని ఆయన సూచించారు. ఇప్పుడు అన్నీ కుట్ర, కక్షపూరిత రాజకీయాలేనని చెప్పారు.