రూ. కోటి 10 లక్షల లంచం కేసు: కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య: కస్టడీలో
హైదరాబాద్: కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కోటి 10 లక్షల రూపాయల లంచం కేసులో నిందితుడిగా విచారణను ఎదుర్కొంటోన్న ఆయన ఈ తెల్లవారు జామున చంచల్గూడ కేంద్ర కారాగారంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారుల అదుపులో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు. నెలరోజులకుగా పైగా విచారణ కొనసాగుతోంది. ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పోస్ట్మార్టమ్ కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కీసర తహశీల్దారుగా పనిచేస్తోన్న సమయంలో తన పరిధిలోని రాంపల్లి దాయిరాలో 28 ఎకరాల స్థలాన్ని మ్యూటేషన్ చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద నుంచి ఆ కోటి 10 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తీసుకుంటూ ఆయన అవినీతి నిరోధక అధికారులకు రెడ్ హ్యాండెండ్గా దొరికిపోయారు. ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కోటి 10 లక్షల రూపాయల లంచాన్ని తీసుకుంటూ దొరికిపోవడం అవినీతి నిరోధక శాఖ చరిత్రలో ఇదే తొలిసారి అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అతి పెద్ద ట్రాప్గా దీన్ని భావించారు.

విచారణ సందర్భంగా నాగరాజుకు సంబంధించిన మరిన్ని అవినీతి కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. తొలి కేసులో నాగరాజు ఇటీవలే బెయిల్పై విడుదల అయ్యారు. భూ మ్యుటేషన్ కేసులో ఆయనపై రెండోసారి కూడా కేసు నమోదు చేశారు అధికారులు. మంగళవారమే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో అయిదుమందిపై కేసు నమోదైంది. ఈ కేసులో మరింత సమాచారాన్ని సేకరించడానికి అధికారులు ప్రయత్నాలు చేపట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో నాగరాజు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది.












Click it and Unblock the Notifications