భారత్-చైనా మధ్య మాల్డోలో చర్చలు-కమాండర్ స్ధాయిలో 12వ సారి..
భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో ఇవాళ మరోసారి చర్చలు ప్రారంభమయ్యాయి. కమాండర్ స్ధాయిలో మాల్డోలో జరుగుతున్న ఈ 12వ దఫా చర్చల్లో ఇరుదేశాల అధికారులు పాల్గొంటున్నారు. సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇందులో చర్చిస్తున్నారు.
లడఖ్ సరిహద్దుల్లోని గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇవాళ ఓ ఒప్పందం కుదిరే అవకాశముంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో పూర్తిగా బలగాల ఉపసంహరణ దిశగా ఇరుదేశాలు చర్చలు గతేడాదిగా చర్చలు జరుపుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఆ అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో పరిమిత స్ధాయిలో అయినా ఉపసంహరణ దిశగా చర్చలు జరుపుతున్నారు.
Recommended Video
వాస్తవానికి జూలై 26న చర్చలకు చైనా ప్రతిపాదించినా కార్గిల్ విజయ్ దివస్ కారణంగా ఆ రోజు జరగాల్సిన చర్చల్ని భారత్ వాయిదా వేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సుకు ఇరువైపులా ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఉపసంహరణ దిశగా జరుగుతున్న ప్రయత్నల్లో భాగంగా బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవాళ జరిగే చర్చల తర్వాత మేజర్ జనరల్ స్ధాయిలోనూ త్వరలో చర్చలు జరిపేందుకు ఇరుదేశాలూ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి.