14 మంది మృతి.. నలుగురు గల్లంతు.. హిమాచల్లో వరద బీభత్సం
భారీ వర్షాలకు హిమాచల్ప్రదేశ్లో వరద పోటెత్తింది. వరదల్లో చిక్కుకొని 14 మంది మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. కులు జిల్లాలో నలుగురు, లాహౌల్ - స్పితి జిల్లాలో ముగ్గురు, చంబా జిల్లాలో ఒకరు మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ సుదేష్కుమార్ మోక్త తెలిపారు. వర్షంతో లాహౌల్కు వెళ్లే రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి.
కులు జిల్లాలో 26 ఏళ్ల పూనమ్ , ఆమె కుమారుడు ఉదయం పార్వతి నదికి ఉపనది అయిన బ్రహంగంగ నదిలో కొట్టుకుపోయారు. నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో.. వరదల్లో మరో ఇద్దరు కొట్టుకుపోయారు. లాహౌల్లోని ఉదయపూర్లో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వచ్చిన వరదలకు ఇద్దరు కార్మికులతో పాటు ఓ ప్రైవేటు జేసీబీ కొట్టుకుపోయింది.
ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో కొందరు కూలీల ఆచూకీ దొరకలేదు. వారిని వెతికేందుకు పోలీసులతోపాటు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలను పంపారు. నీటి ఉధృతి కారణంగా మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్కు ఆటంకం కలిగిందని సుదేష్ మోక్త తెలిపారు. బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించగా.. కార్మికులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని కోరినట్లు లాహోల్-స్పితి డిప్యూటీ కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు.
కొండచరియలు విరిగిపడటంతో 60 వాహనాలు చిక్కుకుపోయాయని, చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. సిమ్లా వికాస్ నగర్లో కొండచరియలు విరిగిపడి కారుపై పడ్డాయి. మరో వైపు షిమ్లా వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.