లోక్సభలో ఆధార్ చట్టసవరణ బిల్లు పాస్...వ్యతిరేకించిన విపక్షాలు
న్యూఢిల్లీ: లోక్సభలో గురువారం పలు బిల్లులు పాస్ అయ్యాయి. ఇందులో ఆధార్ నెంబరును గుర్తింపు కింద స్వచ్ఛంధంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ ఆధార్ చట్టంలో సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆధార్ తప్పనిసరి కాదంటూ పేర్కొంది. అంతేకాదు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ ఫోను కనెక్షన్ల కోసం ఆధార్ను ఒక గుర్తింపు కార్డు కింద సబ్మిట్ చేయొచ్చంటూ బిల్లులో సవరణలు చేసింది.
ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణలను ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ఆధార్ కార్డును స్వచ్చందంగా వినియోగించేందుకు చట్టబద్ధత కల్పించాలని కోరాయి. ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గం ద్వారా చట్టంను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. మోడీ తొలిసారిగా ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిందని ఇప్పుడు దాన్నే చట్టంగా తీసుకొస్తుందని అన్నారు.
యూపీఏ హయాంలో ఆధార్ చట్టాన్ని తీసుకువచ్చామని కాంగ్రెస్ లోక్సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి గుర్తుచేయగా... ఆధార్ చట్టాన్ని యూపీఏ హయాంలో తీసుకొచ్చినప్పటికీ...చట్టబద్ధత మాత్రం ఎన్డీయే హయాంలోనే కల్పించడం జరిగిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆధార్ కార్డు లేని కారణంగా ప్రభుత్వ పథకాలను తిరస్కరించరాదని రవిశంకర్ ప్రసద్ తెలిపారు. మరోవైపు పిల్లలకు18 ఏళ్లు రాగానే ఆధార్ సంఖ్యను ఇష్టమైతే రద్దు చేసుకోవచ్చని ఆయన సభకు తెలిపారు. ఆధార్ సమాచారాన్ని ఎవరైనా ప్రైవేట్ సంస్థలు తీసుకుని స్టోర్ చేసుకుంటే అలాంటి సంస్థలపై రూ. కోటి జరిమానా విధించడం జరుగుతుందని చట్టంలో పొందుపర్చినట్లు రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.అంతేకాదు ఐటీశాఖ మంత్రిగా తాను ఒకరి ఆధార్ వివరాలు అడిగి సేకరించినా తనకు కూడా మూడేళ్లు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు.
ఇదిలా ఉంటే ఆధార్ చట్టంలో చేసిన సవరణలను తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఈ సవరణలో పారదర్శకత లోపించిందని చెప్పింది. అంతేగాదు వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసేలా ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.