అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు: దోషులకు జీవితఖైదు.. శిక్ష ఖరారు చేసిన ఎన్ఐఏ న్యాయస్థానం
అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దోషులు దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్ కు జీవితఖైదు శిక్షను ఖరారు చేస్తూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
ఢిల్లీ: అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు దోషులకు ఎన్ఐఏ కోర్టు జీవితఖైదు విధించింది. 2007 అక్టోబర్ 11న రంజాన్ మాసంలో దర్గా వద్ద పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్ కు శిక్షను ఖరారు చేస్తూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
దోషులు భవేశ్ పటేల్, దేవేంద్ర గుప్తా.. ఇద్దరూ ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ లు. ఓ ఉగ్రవాద కేసులో ఆరెస్సెస్ అనుబంధ వ్యక్తలును దోషులుగా తేల్చడం ఇదే మొదటిసారి. ఇదే కేసులో మూడో దోషిగా ఉన్న ఆరెస్సెస్ ప్రచారకర్త సునీల్ జోషి 2007 డిసెంబర్ లో హత్యకు గురయ్యాడు.
అజ్మీర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు మొత్తం ముగ్గురిని దోషులుగా తేల్చింది. మరో ఏడు మందిని నిర్దోషులుగా ప్రకటించింది. స్వామి అసిమానంద్ కూడా ఈ కేసులో నిర్దోషిగా తేలారు.
2007 అక్టోబర్ 11న రంజాన్ మాసంలో సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. పేలుడు జరిగినప్పుడు దర్గాలో సుమారు అయిదే వేల మంది వరకు ఉన్నారు.