అమేజాన్ కావరం: ఇండియా మ్యాప్ని వక్రీకరించి విక్రయాలు!
న్యూఢిల్లీ: మరోసారి అమేజాన్ తన పైత్యాన్ని చాటుకుంది. గతంలో భారత జాతీయ జెండా నమూనాలో డోర్మ్యాట్లు విక్రయించి మన దేశాన్ని అవమానించిన అమెజాన్ కెనడా.. తాజాగా కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు లేకుండా ఉన్న భారత చిత్రపటాన్ని అమ్మకానికి పెట్టింది.
కాగా, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రతినిధి తజిందర్ పాల్ ఎస్ బగ్గా ఈ పోస్టును గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డీఐ వైథింకర్ అనే సంస్థ డెకరేషన్ వాల్ స్టిక్కర్ కింద భారత చిత్రపటాన్ని అమెజాన్ కెనడాలో అమ్మకానికి పెట్టింది. అయితే ఈ చిత్రపటంలో భారత సరిహద్దులు సరిగ్గా లేవు.
దాదాపు సగం జమ్మూకాశ్మీర్ ఈ మ్యాప్లో కన్పించడంలేదు. ఈ యాడ్ను ఇటీవల గుర్తించిన తజీందర్ ట్విటర్లో పోస్టు చేశారు. 'దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. ఈ చిత్రపటాన్ని అమెజాన్ కెనడా తన సైట్ నుంచి తొలగించాలి. వెంటనే అమ్మకాలు నిలిపివేయాలి' అని ట్విట్టర్ ద్వారా ఆయన హెచ్చరించారు.
గత జనవరిలో మన జాతీయ పతాకం లాంటి డోర్మ్యాట్లను విక్రయించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అమెజాన్పై మండిపడ్డారు. డోర్మ్యాట్ విక్రయాలను వెంటనే నిలిపివేసి, తమ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అయినా బుద్ధి మార్చుకోని అమేజాన్ తరచూ మన దేశానికి సంబంధించి ఇలాంటి వివాదాస్పద, అవమానకర ఉత్పత్తులను తమ సైట్లలో విక్రయిస్తుండటం గమనార్హం. దీనిపై భారత ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.