రాందేవ్కు దేవ్ షాక్: తప్పుడు ప్రకటనలంటూ ఏఎస్సిఐ
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో బహుళజాతి కంపెనీలకు ధీటుగా ఎదుగుతున్న యోగా గురు బాబా రాందేవ్కు చెందిన కంపెనీ పతంజలికి మరోసారి చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవల వంట, వెంట్రుకల నూనెల ప్రకటనలతో ఇబ్బందులు పడ్డ పతంజలి సంస్థపై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సిఐ) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశీయ ప్రకటనలపై వాచ్డాగ్లా పని చేసే ఏఎస్సిఐ.. 'దంత్ కాంతి' టూత్ పేస్టు ప్రకటనలో పతంజలి తప్పుడు విషయాలు పేర్కొంటొందని పేర్కొంది. పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువగా ఆదరణ పొందిన 'దంత్ కాంతి' ప్రకటనలో చెబుతున్నట్లుగా ఎఫెక్టివ్గా లేదని వివరించింది.
దంత స్రావం, వాపు, చిగుళ్ల బ్లీడింగ్, పళ్లు పుసుపు రంగులోకి మారడం, సెన్సిటివిటి, చెడు వాసన లాంటి సమస్యలకు బాగా పనిచేస్తుందనేది నిరూపించబడలేదని ఏఎస్సిఐ స్పష్టం చేసింది. ఇది కూడా మోసం కిందికే వస్తుందని తెలిపింది.
అలాగే పతంజలి సంస్థ మిగిలిన ఉత్పత్తులైన ఆవాల నూనె, పండ్ల రసాలు, పశువులు దాణా ప్రకటనలపై కూడా సందిగ్ధత వ్యక్తం చేసింది. ఈ ప్రకటనల విశ్వసనీయతపై సందేహాలను వ్యక్తం చేసింది.
పతంజలితోపాటుగా సహా అనేక కంపెనీ యాడ్స్పై అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కెల్లాగ్ ఇండియా, లోరియల్, కాల్గేట్ పామోలివ్ వంటి కంపెనీ ప్రకటనలను కూడా సంస్థ తప్పుబట్టింది. ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది.
న్యూ గార్నియర్ కంప్లీట్ డబుల్ యాక్షన్ ఫేస్ వాష్ , హెచ్యూఎల్ ఇన్స్టెంట్ వైట్నింగ్ ప్రకటనలపై సంస్థ తీవ్రంగా స్పందించింది. న్యూ గార్నియర్ వైట్ పూర్తి డబుల్ యాక్షన్, లోరియల్ ప్రకటనల్లో చెప్పినట్టుగా తక్షణం తెల్లబడటం వాస్తవం కాదని తేల్చి చెప్పింది. కేవలం క్రీమ్ల వల్ల తెల్లగా కనిపిస్తారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది.
'డార్క్ స్పాట్స్ పై పోరాటం.. తక్షణం తెల్లబడటం' ఇదంతా మోసమని కౌన్సిల్ పేర్కొంది. ఊహాజనితాలతో ఆయా సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, వీటిని వినియోగదారులను మరోసారి ఆలోచించాలని కోరింది. మొత్తం 141 ఫిర్యాదులను విచారించిన సంస్థ 67 ని సమర్థించింది. వీటితోపాటు పలు కంపెనీలకు చెందిన వాహనాల ప్రకటనలపైనా కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. అడ్డగోలు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.