అస్సాం, మిజోరం భాయీ భాయీ: శాంతి చర్చలు సఫలం -గస్తీ, పోలీసుల మరణాలు, ఆంక్షలపై అంగీకారాలివే
ఈశాన్య భారతంలో సరిహద్దు వివాదాలు మరోసారి రక్తపాతానికి దారితీయకుండా జాగ్రత్త వహించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అస్సాం, మిజోరం మధ్య జరిగిన చర్చలు దాదాపు సఫలం అయ్యాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని అస్సాం, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఇటీవల ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో గస్తీ కోసం దళాలను పంపించరాదని నిర్ణయించాయి. చర్చల అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించాయి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అస్సాం, మిజోరాం ముఖ్యమంత్రులు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు చేపట్టిన చర్యలను మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించినట్లు ఈ సంయుక్త ప్రకటన తెలిపింది. మిజోరాంకు ప్రయాణాలపై జారీ చేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకునేందుకు అస్సాం ప్రభుత్వం అంగీకరించినట్లు వెల్లడించింది.
అంతకుముందు అస్సాం మంత్రులు అశోక్, అతుల్ బోరా, మిజోరాం మంత్రులు లాల్చమ్లియానా, లాల్రువాట్కిమా, హోం శాఖ కార్యదర్శి వన్లాల్నంగైహ్సాకా ఐజ్వాల్లో చర్చలు జరిపారు. తమ భూభాగంలో అక్రమంగా రోడ్డును మిజోరాం నిర్మిస్తోందని అస్సాం ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణం ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. ఈ నేపథ్యంలో..
జూలై 26న ఇరు రాష్ట్రాల దళాలు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కాల్పులకు దిగాయి. ఈ ఘర్షణల్లో ఆరుగురు అస్సాం పోలీసులు, ఓ సాధారణ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు...
మిజోరం సరిహద్దుల విషయంలో చారిత్రక వివాదాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఇప్పుడు భారత్కు తలనొప్పిగా మారింది. పది రోజుల క్రితం అసోంలోని కచార్ జిల్లాలో ఒకటి, మరుసటి రోజు మిజోరం సరిహద్దుల్లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. దీంతో అసోం-మిజోరం సరిహద్దు వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. 'ఈశాన్య ప్రాంతాల పునర్విభజన చట్టం 1971' ప్రకారం అసోం నుంచి లుషాయి హిల్స్ ప్రాంతాన్ని విడదీసి మిజోరం పేరిట కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. 1986లో మిజో నేషనల్ ఫ్రంట్ గ్రూపుతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందంతో 20 ఏళ్ల వేర్పాటువాదానికి తెరపడింది. ఆ మరుసటి ఏడాదే మిజోరమ్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. కాగా,
అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య 164 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. బ్రిటిష్ పాలనలోని నిర్ణయాలతో మిజో ఆదివాసుల్లో నెలకొన్న అసంతృప్తి- ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసోమ్తో సరిహద్దు వివాదంగా రూపాంతరం చెందింది. బ్రిటిష్ పాలకులు వేర్వేరు సందర్భాల్లో జారీ చేసిన రెండు నోటిఫికేషన్ల ఆధారంగా ఇరు రాష్ట్రాలు ఘర్షణలకు దిగుతున్నాయి. బెంగాల్ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం 1875లో నాటి లుషాయి హిల్స్, కచార్ మైదాన ప్రాంతాల సరిహద్దులను బ్రిటిష్ పాలకులు నిర్ణయించారు.
అయితే, భౌగోళిక లబ్ధిని దృష్టిలో పెట్టుకొని మిజోరం ఇదే సరైనదిగా వాదిస్తోంది. లుషాయి హిల్స్- మణిపూర్ మధ్య సరిహద్దులను నిర్ణయిస్తూ 1933లో బ్రిటిష్ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తన వాదనకు అనుకూలంగా ఉండటంతో అసోం దాన్ని నెత్తికెత్తుకొంది. ఈ మ్యాప్ రూపొందించేటప్పుడు సర్వే అధికారులు స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోలేదని మిజోరం నాయకులు వాదిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం లుషాయ్ కొండలు, బరాక్ లోయ, నదులు, అడవులతో నిండి ఉన్నందువల్ల కచ్చితంగా హద్దులను గుర్తించడం కష్టం. ఫలితంగా ఇరువైపులా గ్రామీణులు చాలా సందర్భాల్లో సరిహద్దులు దాటి ముందుకు వెళ్ళి సాగుచేస్తున్నారు. నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. 1994లో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. ఆ తరవాత నుంచి రెండు వైపులా సరిహద్దుల్లో బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే..
2006తో పాటు 2020లోనూ ఘర్షణలు చోటుచేసుకొన్నాయి.యథాతథా స్థితి కొనసాగించాలని..306వ నెంబర్ జాతీయ రహదారి దాదాపు 12 రోజులు మూతపడింది. మిజోరం వైపు సరకుల రవాణాకు ఇదే జీవనాడి. అసోం వైపు నుంచి అక్రమంగా వచ్చిన బంగ్లా జాతీయులే ఈ ఘర్షణలకు కారణమని మిజోరం నాయకులు ఆరోపించారు. ఘర్షణల నివారణకు ఇరు రాష్ట్రాల పోలీసు క్యాంపుల మధ్య బీఎస్ఎఫ్, సశస్త్రసీమాబల్ బలగాలను మోహరించారు. మేఘాలయలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ సమస్య పరిష్కారానికి అసోం-మిజోరం అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. వివాదానికి పరిష్కారం లభించే వరకు యథాతథా స్థితి కొనసాగించాలని నిర్ణయించారు.
Recommended Video
తాజా ఘర్షణల దృష్ట్యా కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాల అధికారులను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపింది. కానీ, కచ్చితమైన పరిష్కారం వెలుగు చూడలేదు. ఇంతలోనే కాల్పులు జరిపైనా ఆక్రమణలను అడ్డుకోవడానికి తమవాళ్లు సిద్ధంగా ఉన్నారంటూ మిజోరం నార్తర్న్ రేంజ్ ఐజీ ఖియాంగ్టే బాధ్యతారహితమైన ప్రకటన చేశారు. మిజో వాసులే 100 ఏళ్లుగా సరిహద్దులు దాటి ఆక్రమణలకు పాల్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు చూస్తే అర్థమవుతుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెబుతున్నారు. ఎట్టకేలకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని అస్సాం, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఇటీవల ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో గస్తీ కోసం దళాలను పంపించరాదని నిర్ణయించాయి. చర్చల అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించాయి.