కశ్మీరీల బాగోగులు అక్కర్లేదు.. 90 నాటి పరిస్థితులు: కేజ్రీవాల్, సిసోడియా నిప్పులు
కశ్మీర్లో పండిట్లపై కాల్పులు కలకలం రేపుతున్నాయి. దీంతో చాలా మంది పండిట్లు ఇళ్లు వదిలి వెళుతున్నారు. దీనిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పండిట్ల పరిస్థితి దయనీయంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడే కాదు గతంలో కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారని వివరించారు.
గత 30 ఏళ్లలో బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే ప్రతీసారి పండిట్లకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పారు. వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. కేజ్రీవాల్ ఆదివారం జంతర్ మంతర్ వద్ద జన్ ఆక్రోశ్ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీకి ఎప్పుడూ రాజకీయాలే ముఖ్యం అని విమర్శించారు.
కశ్మీర్ గురించి మాత్రం దయచేసి రాజకీయాలు చేయొద్దు అని కోరారు. కశ్మీర్లో పరిస్థితిని యదాతథా స్థితికి తీసుకొచ్చేందుకు తన ప్రణాళిక తెలియజేయాలని కోరారు. అలాగే కశ్మీర్ వెలుపల పనిచేయలేమని కశ్మీర్ పండిట్లతో చేసుకున్న బాండ్లను రద్దు చేయాలని కోరారు. పండిట్ల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. వారికి భద్రత కల్పించాలని బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
కేంద్రంలో చెవిటి, మూగ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. అక్కడ చిల్లర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. స్కూల్ లేదు, ఆస్పత్రి లేదు, ఉపాధి లేదు.. అమాయకులు రక్తం చిందిస్తే.. 1990 నాటి ఉగ్రవాద పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. 80 శాతం హిందువులు వలస వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పుడు కశ్మీర్కు దేశం మొత్తం అండగా నిలుస్తోందని చెప్పారు. కశ్మీరీల హత్యలను సహించబోమని తేల్చిచెప్పారు.