నరేంద్ర మోడీ ఎఫెక్ట్: బీజేపీదే ఉత్తర ప్రదేశ్, 207 సీట్లు
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని వీడీపీ అసోసియేట్స్ సర్వే తెలిపింది. పదిహేనేళ్ల తర్వాత అతిపెద్ద రాష్ట్రంలో కమలదళం అధికారంలోకి రానుందని తమ సర్వేలో తేలింది చెబుతోంది.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని వీడీపీ అసోసియేట్స్ సర్వే తెలిపింది. పదిహేనేళ్ల తర్వాత అతిపెద్ద రాష్ట్రంలో కమలదళం అధికారంలోకి రానుందని తమ సర్వేలో తేలింది చెబుతోంది. తద్వారా మోడీ హవా తగ్గలేదని అర్థమవుతోంది.
యూపీలో కాంగ్రెస్ - ఎస్పీలు జతకట్టాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఒంటరిగా బరిలోకి దిగింది. అన్ని పార్టీలు బీజేపీనే టార్గెట్ చేస్తున్నాయి. అయినప్పటికీ 35 శాతం ఓట్లతో బీజేపీ 207 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో తేలింది.
మాదే గెలుపు
యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీని తమ పార్టీ సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం నాడు అన్నారు. పార్టీ యూపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దానికి లోక్ కల్యాణ్ సంకల్ప పత్ర్ అని పేరు పెట్టారు.
అభివృద్ధి చేస్తాం
ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తామని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పదిహేనేళ్ల ఎస్పీ, బీఎస్పీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. పలు హామీలు ఇచ్చారు.
హామీల వర్షం
యువతకు 1జీబీ ఉచిత ఇంటర్నెట్తో ల్యాప్టాప్లు. యూనివర్శిటీల్లో ఉచిత వైఫై సదుపాయం. రైతుల రుణాలు మాఫీ. ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి రానున్న ఐదేళ్లలో రూ.150 కోట్లు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 3, 4 తరగతి ఉద్యోగాలకు ముఖాముఖి రద్దు, నియామకాల్లో అవినీతి అరికట్టడం.
పలు హామీలు
ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన 10 యూనివర్శిటీల ఏర్పాటు. 12వ తరగతి వరకు ఉచిత విద్య. భూ, గనుల మాఫియా అరికట్టేందుకు ప్రత్యేక కార్యదళం. డయల్ 100 మరింత మెరుగుపరిచి, ఘటనాస్థలికి 15 నిమిషాల్లో చేరుకునే ఏర్పాటు. రాష్ట్రంలోని పోలీసు శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ. వ్యవసాయరంగ అభివృద్ధికి నీటి పారుదలకు రూ.20వేల కోట్లు కేటాయింపు.
రామమందిర నిర్మాణం
చట్టాలు అనుసరించి వీలైనంత త్వరలో రామమందిర నిర్మాణం. అయిదేళ్లలో అన్ని గృహాలకు 24 గంటల విద్యుత్తు. 90శాతం యువతకు ఉద్యోగాల కల్పన వంటి హామీలను ప్రకటించారు.